ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ పరిశీలిస్తున్నాం...

18 Sep, 2023 06:47 IST|Sakshi

జేఎల్‌ఆర్‌ ఇండియా ఎండీ రాజన్‌ వెల్లడి

న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) దేశీయంగా బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వాహనాలకు (బీఈవీ) గల డిమాండ్‌ను పరిశీలిస్తోంది. తదనుగుణంగా మరిన్ని మోడల్స్‌ను ప్రవేశపెట్టడానికి సంబంధించిన వ్యూహాన్ని రూపొందించుకోనుంది. జేఎల్‌ఆర్‌ ప్రస్తుతం జాగ్వార్‌ భారత్‌లో ఐ–పేస్‌ అనే ఏకైక ఎలక్ట్రిక్‌ మోడల్‌ను విక్రయిస్తోంది. జేఎల్‌ఆర్‌ ఇండియా ఎండీ రాజన్‌ అంబా ఈ విషయాలు వెల్లడించారు. దేశీయంగా లగ్జరీ వాహనాల సెగ్మెంట్‌ వేగంగా వృద్ధి చెందుతోందని ఆయన చెప్పారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ మార్కెట్లో విక్రయాల వృద్ధి అత్యంత మెరుగ్గా ఉండగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో 1,048 యూనిట్ల విక్రయాలతో అత్యుత్తమ పనితీరు కనపర్చినట్లు పేర్కొన్నారు. అమ్మకాలను పెంచుకోవడంలో భాగంగా తమ సేల్స్‌ నెట్‌వర్క్‌ను కూడా విస్తరించే పనిలో ఉన్నట్లు రాజన్‌ వివరించారు. ప్రస్తుతం తమకు దేశవ్యాప్తంగా 25 సేల్స్‌ అవుట్‌లెట్స్, 27 సరీ్వస్‌ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. జేఎల్‌ఆర్‌ ఇటీవలే కొత్త రేంజ్‌ రోవర్‌ వేలార్‌ వాహనాన్ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 94.3 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌). ఇప్పటికే వేలార్‌కు 750 బుకింగ్స్‌ వచ్చాయని, ఏటా 1,500 యూనిట్ల మేర అమ్మకాలకు అవకాశాలు ఉన్నాయని రాజన్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు