నాన్‌ కాంపిట్‌ అగ్రిమెంట్‌.. ముచ్చటగా మూడోసారి

18 May, 2022 09:33 IST|Sakshi

నాన్‌ కాంపిట్‌ అగ్రిమెంట్‌ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇటు ఇన్ఫోసిస్‌, అటు ఉద్యోగులు వెనక్కి తగ్గకపోవడంతో ఇరువర్గాల మధ్య పీటముడి బిగుస్తుంది. మరోవైపు ఈ వివాదం పరిష్కారం కోసం రంగంలోకి దిగిన కేంద్ర కార్మిక శాఖకు సైతం చుక్కలు కనిపిస్తున్నాయ్‌!

తగ్గేదేలే
నాన్‌ కాంపిట్‌ అగ్రిమెంట్‌ విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా ఉంది ఇన్ఫోసిస్‌ వ్యవహారం. ఈ అంశంపై చర్చించేందుకు కేంద్ర కార్మిక శాఖ రెండోసారి ఏర్పాటు చేసిన సమావేశానికి ఇన్ఫోసిస్‌ డుమ్మా కొట్టింది. ఢిల్లీలోని కార్మిక భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఇన్ఫోసిస్‌ ప్రతినిధులు ఎవ్వరూ హాజరు కాలేదు. అయితే బుద్ద పూర్ణిమ కాబట్టి సమావేశం నిర్వహించేలదంటూ కార్మిక శాఖ వివరణ ఇచ్చింది. అంతేకాదు ఐటీ ఉద్యోగులు, ఇన్ఫోసిస్‌ల మధ్య చర్చలు జరిపేందుకు మరో కొత్త తేదిని ఖరారు చేసింది.

మూడోసారైనా?
నాన్‌ కాంపిట్‌ అగ్రిమెంట్‌ అంశంపై చర్చించేందుకు కేంద్ర కార్మిఖ శాఖ ఏప్రిల్‌ 28న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. అయితే సమయాభావం వల్ల ఇన్ఫోసిస్‌ ఈ సమావేవానికి హాజరు కాలేదంటూ కార్మిక శాఖ తెలిపింది. దీంతో మే 16న రెండోసారి చర్చలకు తేదీని ఖరారు చేసింది కార్మికశాఖ. అయితే అప్పుడు కూడా ఇన్ఫోసిస్‌ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో ముచ్చటగా మూడోసారి మే 26వ తేదిని నిర్ణయించింది కార్మికశా;  ఇన్ఫోసిస్‌, నాసెంట్‌లతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కారిస్తామని నమ్మకంగా ఉంది కార్మిక శాఖ. 

వాట్‌నెక్ట్స్‌
నాసెంట్‌ అగ్రిమెంట్‌ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కార్పొరేట్‌ సెక్టార్‌ నుంచి కొంత మేరకు మద్దతు లభిస్తుండగా.. ఉద్యోగ సంఘాలైతే ఇది సరైన విధానం కాదని అంటున్నాయి. మరోవైపు కేంద్ర కార్మిక శాఖ సీన్‌లోకి ఎంటరైంది. ఇప్పటికయితే రెండుసార్లు ఏర్పాటు చేసిన సమావేశాలకు ఇన్ఫోసిస్‌ హాజరు కాకుండా ఉంది. కానీ కేంద్ర కార్మిక శాఖతో  ఎంతోకాలం ఇలా వ్యవహరించడం వీలుకాని పని. దీంతో మే 26న ఇన్ఫోసిస్‌ ఈ సమస్యకు ఎటువంటి సొల్యూషన్‌ చూపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

మూడుముక్కలాట
తమ సంస్థలో పని మానేసిన ఉద్యోగులు ఏడాది పాటు పోటీ సంస్థల్లో ఉద్యోగాలు చేయడానికి వీలు లేదంటూ నాన్‌ కాంపిట్‌ అగ్రిమెంట్‌ను ఇన్ఫోసిస్‌ తెర మీదకు తెచ్చింది. ఇది తమ హక్కులను కాలరాయడమే అంటూ ఉద్యోగులు నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయిస్‌ సెనేట్‌ (నైట్స్‌)గా ఏర్పడి పోరాటం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కేంద్ర కార్మిఖ శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో నాసెంట్‌, ఇన్ఫోసిస్‌, కేంద్ర కార్మిక శాఖల మధ్య ఈ అంశం చక్కర్లు కొడుతోంది.

చదవండి: ఉద్యోగుల షాక్‌, ఇన్ఫోసిస్‌కు కేంద్రం నోటీసులు!

మరిన్ని వార్తలు