స్కూటర్లు అంటే మనకు ఠక్కున గుర్తుకొచ్చేవి ఒకటి బజాజ్ చేతక్..మరొకటి ఎల్ఎంఎల్ స్కూటర్స్. ఒకానొక సమయంలో భారత టూవీలర్ మార్కెట్లలో ఈ రెండు బ్రాండ్స్ అత్యంత ఆదరణను పొందాయి. కాగా ఇతర కంపెనీలనుంచి నెలకొన్న తీవ్రమైన పోటీతో...కాలక్రామేణా బజాజ్ చేతక్, ఎల్ఎంఎల్ స్కూటర్లు కనుమరుగయ్యాయి. భారత టూవీలర్ మార్కెట్లలో అత్యంత ప్రజాదరణ పొందిన బజాజ్ చేతక్ను సరికొత్తగా ఎలక్ట్రిక్ రూపంలో కంపెనీ లాంచ్ చేసిన విషయం తెలిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎల్ఎంఎల్ కూడా టూవీలర్ మార్కెట్లలోకి సరికొత్త స్కూటర్లును లాంచ్ చేసేందుకు సిద్దమైంది. అది కూడా ఎలక్ట్రిక్ మోడల్.
మూడు ఎలక్ట్రిక్ బైక్స్..!
ఎల్ఎంఎల్ అతి త్వరలో భారత్లో బలమైన పునరాగమనం చేసేందుకు సిద్దమైంది. భారత్లోకి మూడు బైక్లను లాంచ్ చేసేందుకు ఎల్ఎంఎల్ సన్నాహాలను చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో భాగంగా ప్రముఖ జర్మన్ కంపెనీ ఈరాకిట్(eROCKIT)తో జతకట్టింది. ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్, ఈరాకిట్ సంయుక్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించనున్నాయి.
ఎల్ఎంఎల్ 50వ వార్షికోత్సవం సందర్భంగా...3 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను 29 సెప్టెంబర్ 2022న లాంచ్ చేసేందుకు ఎల్ఎంఎల్ సిద్దమైంది. భారత్లో ఈ-హైపర్బైక్, ఈ-బైక్, ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయబోతోంది ఎల్ఎంఎల్. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ బైక్లను పూర్తిగా భారత్లోనే తయారుచేస్తామని కంపెనీ పేర్కొంది. ఈ బైక్స్ కస్టమర్లకు 2023 అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.