బుల్‌ జోరు- మార్కెట్లు ఖుషీ

16 Dec, 2020 16:04 IST|Sakshi

సరికొత్త గరిష్టాలకు చేరిన మార్కెట్లు

403 పాయింట్ల హైజంప్‌- 46,666కు సెన్సెక్స్‌

115 పాయింట్లు ఎగసి 13,683 వద్ద నిలిచిన నిఫ్టీ

రియల్టీ హైజంప్‌- పీఎస్‌యూ బ్యాంక్స్‌ బోర్లా

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.9 శాతం అప్‌

ముంబై, సాక్షి: ఎఫ్‌పీఐల భారీ పెట్టుబడులు, కోవిడ్‌-19 సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ రికవరీ వంటి అంశాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు రికార్డుల దుమ్మురేపుతున్నాయి. తాజాగా సెన్సెక్స్‌ 403 పాయింట్లు జంప్‌చేసి 46,666 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 115 పాయింట్లు ఎగసి 13,683 వద్ద స్థిరపడింది. వెరసి చరిత్రాత్మక గరిష్టాల వద్ద నిలిచాయి. మంగళవారం నాస్‌డాక్‌ సైతం సరికొత్త గరిష్టంవద్ద ముగియడం గమనార్హం! తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో వరుసగా నాలుగో రోజు మార్కెట్లు లాభాలతో నిలిచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 46,705 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13,692 వద్ద సరికొత్త గరిష్టాలను సాధించాయి. 

మెటల్‌, ఆటో.. 
ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ 5 శాతం జంప్‌చేయగా.. మెటల్‌, ఆటో, ఫార్మా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ 1 శాతం స్థాయిలో బలపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌ మాత్రం 1.6 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఓఎన్‌జీసీ, దివీస్‌, యూపీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టైటన్‌, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌ 3-2 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్‌, అల్ట్రాటెక్‌, గెయిల్‌, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్ 1-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి.

రియల్టీ  అప్‌
డెరివేటివ్స్‌లో డీఎల్‌ఎఫ్‌ 10 శాతం దూసుకెళ్లగా.. ఐబీ హౌసింగ్‌, పేజ్‌, అశోక్‌ లేలాండ్‌, జిందాల్‌ స్టీల్‌, హావెల్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, జూబిలెంట్ ఫుడ్‌, నాల్కో, అపోలో టైర్‌, సెయిల్‌ 7-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు పీఎన్‌బీ 6 శాతం పతనంకాగా, జీఎంఆర్‌ ఇన్‌ప్రా, శ్రీరామ్‌ ట్రాన్స్‌, కెనరా బ్యాంక్‌, టాటా కెమ్‌, టొరంట్‌ పవర్, పెట్రోనెట్‌, కంకార్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, బీవోబీ 3.3-1.2 శాతం మధ్య క్షీణించాయి. ఇతర కౌంటర్లలో ఐబీ రియల్టీ 12 శాతం, శోభా, ఒబెరాయ్‌ 5 శాతం చొప్పున ఎగశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.9 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,858 లాభపడగా.. 1,167 నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌ఫీఐల జోరు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,484 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,667 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 2,264 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 1,721 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.

మరిన్ని వార్తలు