నీ లుక్‌ అదిరే సెడాన్‌, మెర్సిడెస్‌ నుంచి రెండు లగ్జరీ కార్లు

16 Jul, 2021 07:31 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా తాజాగా ఏఎంజీ బ్రాండ్‌లో రెండు సరికొత్త సెడాన్స్‌ను భారత్‌లో గురువారం ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ‘ఈ 53 4మేటిక్‌ ప్లస్‌’ ధర రూ.1.02 కోట్లు కాగా ‘ఈ 63 ఎస్‌ 4మేటిక్‌ ప్లస్‌’ ధర రూ.1.70 కోట్లు. ఏఎంజీ శ్రేణిలో అత్యంత వేగంగా ప్రయాణించే సెడాన్‌ ఈ 63 ఎస్‌ 4మేటిక్‌ ప్లస్‌ అని కంపెనీ సేల్స్, మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంతోష్‌ అయ్యర్‌ ఈ సందర్భంగా తెలిపారు.

9 స్పీడ్‌ మల్టీ క్లచ్‌ ట్రాన్స్‌మిషన్, 612 హెచ్‌పీ, 850 ఎన్‌ఎం టార్క్‌తో 4.0 లీటర్‌ వీ8 బైటర్బో ఇంజిన్‌ను దీనికి పొందుపరిచారు. 3.4 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 300 కిలోమీటర్లు. 435 హెచ్‌పీ, 520 ఎన్‌ఎం టార్క్‌తో ట్విన్‌ టర్బోచార్జింగ్‌తో ఎలక్ట్రిఫైడ్‌ 3.0 లీటర్‌ ఇంజిన్‌ను ఈ 53 4మేటిక్‌ ప్లస్‌కు జోడించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 4.5 సెకన్లలో చేరుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. వైడ్‌స్క్రీన్‌ కాక్‌పిట్, ఏఎంజీ పెర్ఫార్మెన్స్‌ స్టీరింగ్‌ వీల్, ఎంబక్స్‌ ఇన్ఫోటెయిన్‌మెంట్‌ సిస్టమ్‌ వంటి హంగులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంస్థకు 94 విక్రయ కేంద్రాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కారును కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని వార్తలు