ChatGPT: గూగుల్‌కు గుబులు.. చాట్‌జీపీటీతో సత్య నాదెళ్ల మరో మాస్టర్‌ ప్లాన్‌!

11 Feb, 2023 16:43 IST|Sakshi

కృత్తిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ) విభాగంలో గూగుల్‌ను మరింత వెనక్కి నెట్టేందుకు మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల మరింత వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు. రాబోయే వారాల్లో ఎంఎస్‌ వర్డ్‌, పవర్‌ పాయింట్‌, ఔట్‌లుక్‌లలో ఏఐ చాట్‌జీపీటీ డెమో ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.  

ది వెర్జ్ నివేదిక ప్రకారం, మార్చి నెలలో ఏఐ టెక్నాలజీపై సత్యా నాదెళ్ల భవిష్యత్‌ ప్రణాళికల్ని వివరించనున్నారు. ఇందులో భాగంగా ఓపెన్‌ ఏఐలో మరిన్ని పెట్టుబడులు పెట్టి అన్నీ ప్రొడక్ట్‌లలో మైక్రోసాఫ్ట్‌ ఏఐ టెక్నాలజీని ఇంటిగ్రేట్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

తద్వారా దాని ప్రొడక్టీవ్‌ యాప్స్‌ను ఎంత త్వరగా తిరిగి ఆవిష్కరించాలనుకుంటుందో వచ్చే నెలలో చేసే ప్రకటనలో మైక్రోసాప్ట్‌ హైలైట్ చేస్తుంది’అంటూ వెర్జ్‌ నివేదిక తెలిపింది. ఇప్పటికే చాట్‌జీపీటీని ఔట్‌లుక్‌లో మెయిల్స్‌కు రిప్లయ్‌ ఇచ్చేలా సెర్చ్‌ రిజల్ట్స్‌ మరింత అందంగా తీర్చిదిద్దేలా చాట్‌జీపీటీని టెస్ట్‌ చేసినట్లు పేర్కొంది. దీంతో పాటు వర్డ్‌ డాక్యుమెంట్ ఇంటిగ్రేషన్‌ని మెరుగుపరచడం కోసం జీపీటీ మోడల్‌ను పరీక్షించినట్లు గతంలో నివేదించింది.  

ఈ తరుణంలో పోటీగా గూగుల్‌ బార్డ్‌ రావడంతో మరింత దూకుడుగా ముందుకు సాగేందుకు  సిద్దమయ్యారు సత్యనాదెళ్ల. బార్డ్‌ను అందుబాటులోకి  తెస్తున్నట్లు గూగుల్‌ ప్రకటన చేసిన వారం రోజుల వ్యవధిలో మైక్రోసాఫ్ట్‌ వివా సేల్స్‌లో ఏఐ ఎక్స్‌పీరియన్స్‌ అందించనుంది. దీని సాయంతో సేల్స్ ఈమెయిల్స్‌ను రూపొందించడానికి అజూర్‌ ఓపెన్‌ ఏఐ సర్వీస్, జీపీటీని ఉపయోగించుకోవచ్చు. ఇది ఔట్‌లుక్‌లో మైక్రోసాఫ్ట్‌ పరీక్షిస్తున్న కొన్ని ఫీచర్లను పోలి ఉంటుందని సమాచారం.

మరిన్ని వార్తలు