స్మార్ట్ ఫోన్స్ తయారీకి చిప్‌ల కొరత

28 Dec, 2020 17:29 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి 48,000 కోట్లతో భారత ప్రభుత్వం మూడు పథకాలను ఆవిష్కరించింది. అందులో ఒకటి ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకం. ఈ పథకంలో భాగంగా వచ్చే ఐదేళ్లలో 10.5 లక్షల కోట్ల రూపాయల మొబైల్ ఫోన్‌ల తయారీ కోసం పీఎల్‌ఐ పథకం కింద దేశీయ, అంతర్జాతీయ సంస్థల నుండి 16 ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాయి. వీటిని పరిశీలించిన ప్రభుత్వం గత అక్టోబర్‌లో కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూ.11 వేల కోట్లను కూడా విడుదల చేసింది. తాజాగా ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకం కింద ఎలక్ట్రానిక్స్ చిప్స్ తయారుచేసే కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనుకున్న ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునే అవకాశం లేదు అని ప్రభుత్వానికి పేర్కొన్నాయి.(చదవండి: అత్యంత ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్)

మొబైల్ పరికరాల పరిశ్రమ సంస్థ(ఐసీఇఎ)లో సభ్యులైన ఆపిల్, ఫాక్స్కాన్, విస్ట్రాన్ మరియు లావా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఐటి కార్యదర్శి అజయ్ ప్రకాష్ సాహ్నీకి డిసెంబర్ 24న ఒక లేఖ రాసాయి. అందులో కోవిడ్ -19 చేత సరఫరా పరిమితులతో ఏర్పడిన కొరత కారణంగా పీఎల్‌ఐ పథకం కింద గతంలో విధించుకున్న లక్ష్యాలను చేరుకోక పోవచ్చని తెలిపాయి. "పీఎల్‌ఐ పథకం కింద చేరిన కంపెనీలు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీటిలో చాలా కంపెనీలు అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు కానీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో కాదని" ఐసిఇఎ చైర్మన్ పంకజ్ మొహింద్రూ లేఖలో తెలిపారు.    ‌

ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఇఎ) గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రానిక్ చిప్‌ల కొరతకు కారణాలను వివరించింది. చైనా టెక్నాలజీ దిగ్గజం "హువావే" సంస్థ ఎలక్ట్రానిక్‌ చిప్స్‌, ప్రాసెసర్ల సరఫరాపై గత సెప్టెంబర్ లో అమెరికా నిషేధం విధించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని హువావే 2 సంవత్సరాలకు సరిపడా చిప్‌లను దిగుమతి చేసుకుంది. దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చిప్‌ల కొరత తీవ్రంగా ఉందని తెలిపింది. దింతో వివిధ దేశాలకు చెందిన సంస్థలు 97 శాతం సరఫరా భారత దేశ తయారీ కంపెనీలకు నిలిపివేశాయని మోహింద్రూ చెప్పారు. అంతర్జాతీయ విమాన నిషేధంతో పాటు ఇతర లాజిస్టిక్స్ ఇష్యూ కారణంగా పీఎల్‌ఐ పథకం ప్రారంభించడానికి నాలుగు నెలల ముందు పలు కంపెనీల కార్యకలాపాలు దెబ్బతిన్నాయని ఐసీఇఎ తెలిపింది. పీఎల్‌ఐ పథకం కింద ప్రోత్సాహకం కోసం కాలపరిమితులను సర్దుబాటు చేయాలని పరిశ్రమల సంఘం కోరింది.

మరిన్ని వార్తలు