Layoffs: ట్విటర్‌లో మరిన్ని కోతలు.. ఈసారి వారి వంతు!

20 Feb, 2023 16:26 IST|Sakshi

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తాజాగా మరికొంత మంది ఉద్యోగులను తొలగించిందని ‘ది ఇన్‌ఫర్మేషన్’ అనే వార్తా వెబ్‌సైట్ నివేదించింది. భారత్‌లోని మూడు కార్యాలయాల్లో రెండింటిని మూసేసి ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయమని చెప్పడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొంది. ఈసారి సేల్స్ టీమ్ నుంచి ఉద్యోగులను తొలగించినట్లు నివేదికను సూచించింది. అయితే ఎంతమందిని తొలగించింది స్పష్టత లేనప్పటికీ నెల రోజుల్లోనే ట్విటర్‌ సుమారు 800 మంది సేల్స్, మార్కెటింగ్ ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది.

గతేడాది చివర్లో భారత్‌లో దాదాపు 200 మందికిపైగా ఉన్న తమ సిబ్బందిలో 90 శాతం మందిని తొలగించిన ట్విటర్ న్యూఢిల్లీ, ముంబైలోని కార్యాలయాలను మూసివేసినట్లు తెలిసిందే. దేశ దక్షిణ టెక్ హబ్‌గా పేర్కొనే ఇంజనీర్లు ఎక్కువగా ఉండే బెంగళూరులోని  కార్యాలయాన్ని మాత్రం కొనసాగిస్తోంది.

సీఈవో ఎలాన్ మస్క్ 2023 చివరి నాటికి ట్విటర్‌ను ఆర్థికంగా స్థిరీకరించే ప్రయత్నంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సిబ్బందిని తొలగిస్తూ కార్యాలయాలను మూసివేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంటర్నెట్ రంగంలో మెటా (ఫేస్‌బుక్‌), ఆల్ఫాబెట్ (గూగుల్‌) వంటి అమెరికన్‌ టెక్ దిగ్గజాలు దీర్ఘకాలిక వ్యూహాలతో దూసుకెళ్తుంటే ఎలాన్‌ మస్క్‌ చర్యలు మాత్రం విస్మయాన్ని కలిగిస్తున్నాయి.

మరిన్ని వార్తలు