ఎన్‌బీఎఫ్‌సీల ఏయూఎం డౌన్‌

14 Sep, 2021 06:23 IST|Sakshi

క్యూ1లో తగ్గిన రుణ పంపిణీ

ముంబై: నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) వెనకడుగు వేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికం(ఏప్రిల్‌–జూన్‌)లో రుణ పంపిణీ తగ్గడం, పోర్ట్‌ఫోలియో విలువలు క్షీణించడం ప్రభావం చూపినట్లు రేటింగ్స్‌ సంస్థ ఇక్రా నివేదిక పేర్కొంది. అయితే గతేడాది(2020–21) ద్వితీయార్థంలో ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(హెచ్‌ఎఫ్‌సీ)ల రుణ మంజూరీ పుంజుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. అంటే గత క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌), క్యూ4(జనవరి–మార్చి)లతో పోలిస్తే త్రైమాసిక ప్రాతిపదికన ఈ క్యూ1లో 55 శాతం తిరోగమించినట్లు తెలియజేసింది. గతేడాది క్యూ1తో పోలిస్తే మారటోరియంలు లేని పరిస్థితుల్లో ఈ క్యూ1లో ఎన్‌బీఎఫ్‌సీల ఏయూఎం నీరసించినట్లు నివేదిక వివరించింది. హెచ్‌ఎఫ్‌సీల ఏయూఎం మాత్రం దాదాపు యథాతథంగా నమోదైనట్లు పేర్కొంది.

పెంటప్‌ డిమాండ్‌ .. పెంటప్‌ డిమాండ్‌ కారణంగా ఈ జులైలో రుణ విడుదల ఒక్కసారిగా ఊపందుకున్నట్లు ఇక్రా నివేదిక వెల్లడించింది. ఈ స్పీడ్‌ కొనసాగేదీ లేనిదీ స్థూల ఆర్థిక సంకేతాలపై ఆధారపడి ఉంటుందని తెలియజేసింది. కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌ ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో రికవరీని తాత్కాలికంగా దెబ్బతీసినట్లు ఇక్రా వైస్‌ప్రెసిడెంట్, ఫైనాన్షియల్‌ రంగ హెడ్‌ మనుశ్రీ సగ్గర్‌ పేర్కొన్నారు. అయితే ఈ ఏడాదిలో రుణ మంజూరీ వార్షిక ప్రాతిపదికన 6–8 శాతం పుంజుకోగలదని అంచనా వేశారు. ఇక ఏయూఎం అయితే 8–10 శాతం స్థాయిలో బలపడవచ్చని అభిప్రాయపడ్డారు. గతే డాది లోబేస్‌ కారణంగా పలు కీలక రంగాల నుంచి డిమాండ్‌ మెరుగుపడనున్నట్లు తెలియజేశారు.

ఆస్తుల నాణ్యతపై.. స్థానిక లాక్‌డౌన్‌ల కారణంగా ఈ క్యూ1లో ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తుల(రుణాల) నాణ్యత భారీగా బలహీనపడినట్లు ఇక్రా నివేదిక పేర్కొంది. అయితే వసూళ్లు ప్రోత్సాహకరంగానే ఉన్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది నికర రికవరీలు, రద్దులతో కూడిన ఓవర్‌డ్యూస్‌లో 0.5–1 శాతం పెరుగుదల నమోదుకావచ్చని అంచనా వేసింది. ఇవి ఇకపై లాక్‌డౌన్‌లు ఉండబోవన్న అంచనాలుకాగా..  రుణ నాణ్యతపై ఒత్తిళ్లు కొనసాగనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుత అనిశి్చతుల నేపథ్యంలో రైటాఫ్‌లు అధికంగా నమోదుకావచ్చని అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు