-

హెచ్‍డీఎఫ్‍సీకి, ఐజీహెచ్‌ హోల్డింగ్స్‌కు భారీ షాకిచ్చిన ఆర్బీఐ

18 Mar, 2023 17:23 IST|Sakshi

సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌డీఎఫ్‌సీ) కి భారీ షాకిచ్చింది. నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘించినందుకు శుక్రవారం 5 లక్షల రూపాయల జరిమానా విధించింది.  నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఆదేశాలు నిబంధనలను పాటించనందుకు సెంట్రల్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీకి ఈ జరిమానా విధించింది. దీంతోపాటు IGH హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఏకంగా రూ. 11.25 లక్షల ద్రవ్య పెనాల్టీని విధించింది.

2019-20లో కొంతమంది డిపాజిటర్ల మెచ్యూర్డ్ డిపాజిట్లను కంపెనీ వారి నిర్దేశిత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయలేక పోయిందని తమ పరిశీలనలో వెల్లడైందని ఆర్‌బీఐ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు పెనాల్టీ ఎందుకు విధించకూడదో తెలపాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసిన ఆర్బీఐ కంపెనీ వివరణ తర్వాత, నిబంధనలకు అనుగుణంగా లేదని నిర్ధారించి జరిమానా విధించింది. వారి డిపాజిటర్ల మెచ్యూర్డ్ డిపాజిట్లను వారి నామినేట్ చేసిన బ్యాంకు ఖాతాలకు కంపెనీ బదిలీ చేయలేకపోయిందని తనిఖీలో వెల్లడైనట్లు  కేంద్ర బ్యాంకు వెల్లడించింది. 

అలాగే నిబంధనలు పాటించని కారణంగా ముంబైలోని ఐజీహెచ్‌ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ.11.25 లక్షల  పెనాల్టీ విధించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను లాభ, నష్టాల ఖాతాలో వెల్లడించిన నికర లాభంలో 20 శాతాన్ని రిజర్వ్ ఫండ్‌కు బదిలీ చేయాలనే చట్టబద్ధమైన నిబంధనను పాటించడంలో కంపెనీ విఫలమైందని  ఆర్బీఐ పేర్కొంది.

మరిన్ని వార్తలు