రిస్క్‌ ప్రాజెక్టులకు ఈక్విటీ నిధులే బెటర్‌!

11 Mar, 2022 17:22 IST|Sakshi

న్యూఢిల్లీ: అమలుకు విషయంలో ఇబ్బందులు ఉన్న (ఇంప్లిమెంటేషన్‌ రిస్క్‌) ప్రాజెక్టులకు సాధారణంగా క్యాపిటల్‌ మార్కెట్‌ల ద్వారా నిధులు సమీకరణే సమంజసమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఎన్‌ఎస్‌ విశ్వనాథన్‌ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు ప్రజా డిపాజిట్‌లను ఉపయోగించే బ్యాంకుల డబ్బు వినియోగం తగదని ఉద్ఘాటించారు. 

అసోచామ్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్ట్‌లకు నిధులు సమకూర్చగల, దాని నష్టాలను నిర్వహించగల బలమైన బాండ్‌ మార్కెట్‌ భారతదేశానికి అవసరమని అన్నారు. మొండిబకాయిలకు సంబంధించి భారత్‌ బ్యాంకింగ్‌ నియమ నిబంధనలు ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు.  

ఐబీఏలో తొలి అడుగే..: సంతోష్‌ కుమార్‌ శుక్లా 
కాగా కార్యక్రమంలో ఇన్సూరెన్స్‌ అండ్‌ బ్యాంక్‌రప్ట్సీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ కుమార్‌ శుక్లా మాట్లాడుతూ,  బ్యాంకింగ్‌లో ఎన్‌పీఏలు తగ్గుదలకు దివాలా చట్టం ఎంతో దోహదపడుతోందన్నారు. ఈ విషయంలో గడచిన ఐదేళ్లలో ఎంతో పురోగతి సాధించినా, ఇవి ఇంకా తొలి అడుగులుగానే భావించాలని అన్నారు. 

దివాలా పరిష్కార పక్రియలో 
చోటుచేసుకుంటున్న జాప్యం నేపథ్యంలో కొన్ని అసెట్స్‌ విలువల్లో క్షీణత సైతం చోటుచేసుకుంటోదన్నారు.  సీఓసీ (క్రెడిటార్ల కమిటీ) వేగవంతమైన నిర్ణయాలు తీసుకోగలిగి, ఇతర వ్యవస్థలతో త్వరితగతిన అనుసంధానమై పనిచేయగలిగితే, దివాలా పరిష్కార పక్రియ మరింత వేగవంతం
అవుతుందని అన్నారు.  

దేశ రుణ భారం తగ్గాలి: అజిత్‌ పాయ్‌ 
సమావేశంలో  ఎకనామిక్స్‌ అండ్‌ ఫైనాన్స్‌కు సంబంధించి నీతి ఆయోగ్‌ విశిష్ట నిపుణుడు అజిత్‌ పాయ్‌ మాట్లాడుతూ, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దేశ రుణ భారం నిష్పత్తి (దాదాపు 80 శాతం) మరింత తగ్గాల్సి ఉందన్నారు. ఇతర పలు జీ–20 దేశాలతో పోలి్చతే ఈ విషయంలో భారత్‌ వెనుకబడి ఉందని అన్నారు.

మరిన్ని వార్తలు