కొత్త రికార్డ్‌! ఐపీవో ముగిసిన రెండు రోజుల్లోనే లిస్టింగ్‌..

20 Sep, 2023 08:23 IST|Sakshi

న్యూఢిల్లీ: గత వారం ఐపీవోకు వచ్చిన వైర్లు, కేబుళ్ల తయారీ కంపెనీ ఆర్‌ఆర్‌ కేబుల్‌ కొత్త రికార్డుకు తెరతీస్తోంది. బుధవారం (సెప్టెంబర్‌ 20) స్టాక్‌ ఎక్స్చేంజీల్లో లిస్ట్‌ అవుతోంది. వెరసి పబ్లిక్‌ ఇష్యూ ముగిసిన రెండు రోజుల్లోనే స్టాక్‌ ఎక్సే్ఛంజీల్లో లిస్ట్‌ అయిన తొలి కంపెనీగా నిలుస్తోంది.

ఇక టీ+3 విధానంలో లిస్టయిన తొలి కంపెనీ రత్నవీర్‌ ప్రెసిషన్‌ ఇంజనీరింగ్‌కాగా.. రెండో రోజు నుంచి టీ+2లో ఆర్‌ఆర్‌ కేబుల్‌లో ట్రేడింగ్‌ ప్రారంభంకానుంది. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆగస్ట్‌లో ఐపీవో తదుపరి లిస్టింగ్‌ కాలాన్ని సగానికి కుదించింది.

దీంతో టీ+6 నుంచి టీ+3కి లిస్టింగ్‌ కాలావధి తగ్గింది. ఆర్‌ఆర్‌ కేబుల్‌ ఇష్యూ సెప్టెంబర్‌ 13న మొదలై 15న ముగిసింది. సెప్టెంబర్‌ 1 నుంచి లిస్టింగ్‌ తాజా మార్గదర్శకాలు స్వచ్చంద ప్రాతిపదికన అమలులోకి వచ్చాయి. అయితే 2023 డిసెంబర్‌ 1 నుంచి తప్పనిసరి కానున్నాయి.  ఈ నెల 20 నుంచి ఆర్‌ఆర్‌ కేబుల్‌ ఈక్విటీ షేర్లు బీ గ్రూప్‌లో లిస్ట్‌కానున్నట్లు బీఎస్‌ఈ ఒక ప్రకటనలో పేర్కొంది. 

మరిన్ని వార్తలు