విమర్శలు ఎదురైనా తగ్గేదేలే.. భారత్‌కు చమురు సరఫరాలో రష్యానే టాప్‌

6 Nov, 2022 20:24 IST|Sakshi

భారత్‌కు ముడి చమురు సరఫరా చేయటంలో సౌదీ అరేబియా, ఇరాక్‌లను వెనక్కి నెట్టింది రష్యా. ఈ ఏడాది అక్టోబరులో అత్యధిక చమురు సరఫరా చేసిన దేశంగా నిలిచింది. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 0.2 శాతం. అదే ఈ ఏడాది అక్టోబరులో రోజుకు 9,35,556 పీపాల చమురును దిగుమతి చేసుకోవడం గమనార్హం. దీంతో దేశ చమురు దిగుమతుల్లో రష్యా వాటా 22 శాతానికి చేరింది. మరోవైపు.. ఇరాక్‌ నుంచి 20.5 శాతం, సౌదీ అరేబియా నుంచి 16 శాతం మాత్రమే ముడి చమురును దిగుమతి చేసుకుంది భారత్‌. 

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టిన తర్వాత మాస్కో నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతి గణనీయంగా పెరిగింది. పశ్చిమ దేశాలు రష్యా చమురు ఎగమతులపై ఆంక్షలు విధించడంతో రాయితీ ధరకు విక్రయించేందుకు ముందుకొచ్చింది మాస్కో. అందిపుచ్చుకున్న భారత్‌ భారీ ఎత్తున దిగమతులను పెంచుకుంది. డిసెంబరు 2021లో రష్యా నుంచి భారత్‌కు రోజుకి 36,255 పీపాల చమురు మాత్రమే వచ్చింది. అదే ఇరాక్‌ నుంచి 1.05 మిలియన్లు, సౌదీ అరేబియా 9,52,625 బ్యారెళ్ల చమురు దిగుమతి జరిగింది. 

ఈ ఏడాది మార్చిలో రష్యా నుంచి భారత్‌కు రోజుకు 68,600 పీపాల ముడి చమురు రాగా.. మే నెలలో అది 2,66,617 పీపాలకు పెరిగింది. జూన్‌ నాటికి గరిష్ఠంగా 9,42,694కు చేరింది. మరోవైపు.. ఆ నెలలో రోజుకు 1.04 మిలియన్‌ బీపీడీలతో ఇరాక్‌ అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలిచింది. రష్యా రెండో స్థానానికి చేరింది.

ఇదీ చదవండి: చుక్కలనంటుతున్న అద్దెలు, కట్టలేక ఖాళీ చేస్తున్న జనాలు

మరిన్ని వార్తలు