సాక్షి మనీ మంత్ర: నిఫ్టీ@20,267.. ఆల్‌టైం హైలో దేశీయ స్టాక్‌మార్కెట్లు

1 Dec, 2023 16:12 IST|Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 134 పాయింట్లు లాభంతో 20,267 వద్దకు చేరి ఆల్‌టైంహైకు చేరింది. సెన్సెక్స్‌ 492 పాయింట్లు పుంజుకుని 67,481 పాయింట్లు వద్ద స్థిరపడింది. 

అమెరికా మార్కెట్‌ సూచీలు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణం తగ్గనుందనే సంకేతాలు అక్కడి మదుపర్లను ఉత్సాహపరిచాయి. మొత్తంగా నవంబర్‌లో యూఎస్‌ సూచీలు 2022 అక్టోబర్‌ తర్వాత మెరుగైన నెలవారీ లాభాలను నమోదుచేశాయి. ఐరోపా మార్కెట్లు సైతం గురువారం లాభాల్లో స్థిరపడ్డాయి. బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర స్వల్పంగా తగ్గి 82.96 డాలర్లకు చేరింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. తయారీ, గనులు, సేవల రంగం మెరుగ్గా రాణించడంతో ఇది సాధ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపర్లు గురువారం రూ.8,147 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. దేశీయ మదుపర్లు రూ.780 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. నిఫ్టీ ఆల్‌టైంహైకు చేరింది. బ్యాంకులు, మెటల్‌, ఆటో, స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్‌లు అందుకు సహకరించాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఐటీసీ, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, రిలయన్స్‌, నెస్లే, హెచ్‌యూఎల్‌ కంపెనీ స్టాక్‌లు లాభాల్లో ట్రేడయ్యాయి. ఎం అండ్‌ ఎం, విప్రో, టాటా మోటార్స్‌, మారుతీ సుజుకీ, హెచ్‌డీఎఫ​్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, టైటాన్‌ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు