ఎస్‌బీఐ కీల‌క నిర్ణ‌యం, బ్యాంక్ ఖాతాదారుల‌కు శుభ‌వార్త‌!!

16 Feb, 2022 19:34 IST|Sakshi

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు శుభ‌వార్త‌. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లనుపెంచుతూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దీంతో బ్యాంక్ నిర్ణ‌యంపై ఫిక్స్‌డ్ డిపాజిట‌ర్లు సంతోషం వ్య‌క్తం చేస్తుండ‌గా ..కొత్త‌గా పెరిగిన వ‌డ్డీ రేట్లు నేటి నుంచి అమ‌ల్లోకి  వ‌చ్చాయి. కాగా రూ.2 కోట్ల కంటే తక్కువ విలువైన ఎఫ్‌డీలకు కొత్త రేట్లు వర్తిస్తాయి.

 ఎస్‌బీఐ వెబ్‌సైట్ క‌థ‌నం ప్ర‌కారం..ఎస్‌బీఐ ఇప్పుడు 2ఏళ్లకు పైన కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 నుంచి 15 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.

2 సంవత్సరాల నుండి 3సంవత్సరాల కంటే తక్కువ ఫిక్స్‌డ్రేట్ల కాల‌ప‌రిమితిలో వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 5.20 శాతానికి, 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి 15 బేసిస్ పాయింట్లు  పెరిగి 5.45 శాతానికి చేరింది.   

♦ 5 సంవత్సరాలు నుంచి 10 సంవత్సరాల వరకు ఎఫ్‌డీల కాల‌ప‌రిమితిలో వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 5.50 శాతానికి చేరుకుంది.

♦ 2 సంవత్సరాల కంటే తక్కువ కాలవ్యవధి ఎఫ్‌డీపై వడ్డీ రేట్లు మారవు. ఎస్‌బీఐ జనవరి 2022లో 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలం ఉన్న ఎఫ్‌డీల‌ వడ్డీ రేటును రూ. 2 కోట్లలోపు 10 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచిందని గమనించాలి. ఈ ఎఫ్‌డీలు ఇప్పుడు 5.1 శాతం (5% నుండి పెరిగాయి) సీనియర్ సిటిజన్‌లు 5.6% (5.5% నుండి) వ‌డ్డీని పొంద‌వ‌చ్చు. 

♦ డిసెంబర్ 2021లో ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం..బేస్ రేటును 0.10 శాతం లేదా 10 బీపీఎస్‌కి పెంచింది. కొత్త బేస్ రేటు, అంటే సంవత్సరానికి 7.55శాతం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరి 10, 2022న ప్రకటించిన ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో రెపో మరియు రివర్స్ రెపో రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది.

మరిన్ని వార్తలు