టాటా టెక్నాలజీ ఐపీఓ : స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లకు ముఖ్యగమనిక! 

24 Nov, 2023 09:01 IST|Sakshi

ఇంజినీరింగ్, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ డిజిటల్‌ సర్వీసుల కంపెనీ టాటా టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూకి భారీ స్పందన లభిస్తోంది. ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుండటంతో రెండో రోజు గురువారానికల్లా 15 రెట్లు అధిక సబ్‌స్క్రిప్షన్‌ నమోదైంది. షేరుకి రూ. 475–500 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూలో భాగంగా కంపెనీ 4.5 కోట్లకుపైగా షేర్లను ఆఫర్‌ చేసింది. అయితే దాదాపు 67 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. దీంతో నేడు(24న) ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 3,043 కోట్లవరకూ అందుకోనుంది.

టీసీఎస్‌(2004) తదుపరి రెండు దశాబ్దాలకు టాటా గ్రూప్‌ నుంచి వస్తున్న ఐపీవోకాగా.. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్‌) విభాగంలో 8.5 రెట్లు బిడ్స్‌ లభించగా.. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 31 రెట్లు, రిటైలర్ల నుంచి 11 రెట్లు చొప్పున దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇష్యూలో భాగంగా మంగళవారం(21న) యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 791 కోట్లు సమీకరించిన విషయం విదితమే. 

ఫెడ్‌ఫినా స్పందన.. అంతంతే!
రెండో రోజుకల్లా 90 శాతం బిడ్స్‌ :
దేశీ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు పలు ఇష్యూలతో సందడి చేస్తున్నాయి. టాటా టెక్నాలజీస్, గాంధార్‌ ఆయిల్‌ రిఫైనరీ, ఫ్లెయిర్‌ రైటింగ్‌ ఇండస్ట్రీస్, ఇరెడా పబ్లిక్‌ ఇష్యూలు భారీస్థాయిలో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రయివేట్‌ రంగ సంస్థ ఫెడరల్‌ బ్యాంక్‌ అనుబంధ సంస్థ ఫెడ్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌(ఫెడ్‌ఫినా) ఐపీవోకు స్పందన అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. ఇష్యూ రెండో రోజు గురువారానికల్లా 90 శాతమే సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది.

ఐపీవోలో భాగంగా 5.59 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచగా.. 5.03 కోట్ల షేర్ల కోసం బిడ్స్‌ దాఖలయ్యాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్‌) విభాగంలో 56 శాతం, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 52 శాతం చొప్పున బిడ్స్‌ లభించగా.. రిటైలర్లు 1.25 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. షేరుకి రూ. 133–140 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ సుమారు రూ. 1,093 కోట్లు సమీకరించా లని భావిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 601 కో ట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 3,51,61,723 షేర్ల(రూ. 492 కోట్ల విలువ)ను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదా రులు విక్రయానికి ఉంచనున్నారు. యాంకర్‌ ఇన్వెస్టర్లకు షేర్ల జారీ ద్వారా మంగళవారం(21న) రూ. 325 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు