నేడు ఓపెనింగ్‌లో మార్కెట్లు డీలా?!

22 Oct, 2020 08:29 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 34 పాయింట్లు మైనస్‌

నిఫ్టీకి నేడు 11,804-11,668 వద్ద సపోర్ట్‌!

0.3 శాతం క్షీణించిన యూఎస్‌ మార్కెట్లు

నష్టాలతో ట్రేడవుతున్న ఆసియా మార్కెట్లు

ఎఫ్‌పీఐల పెట్టుబడులు- డీఐఐల విక్రయాలు

నేడు (22న) దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యే  అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 34 పాయింట్లు తక్కువగా 11,895 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ 11,929 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కోవిడ్‌-19 ప్యాకేజీపై సందేహాల నేపథ్యంలో బుధవారం ఆటుపోట్ల మధ్య యూఎస్‌ మార్కెట్లు 0.3 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు సైతం నష్టాలతో కదులుతున్నాయి. వరుసగా నాలుగు రోజులపాటు దేశీ మార్కెట్లు ర్యాలీ చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇవ్వవచ్చని, దీంతో నేడు కూడా హెచ్చుతగ్గులు నమోదుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 

నాలుగో రోజూ జోరు
వరుసగా నాలుగో బుధవారం రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 163 పాయింట్లు పుంజుకుని 40,707 వద్ద నిలవగా.. నిఫ్టీ 41 పాయింట్లు జమ చేసుకుని 11,938 వద్ద స్థిరపడింది. అయితే ఇంట్రాడేలో మార్కెట్లు ఊగిసలాటకు లోనయ్యాయి. వెరసి సెన్సెక్స్‌ 40,976 వద్ద గరిష్టాన్ని తాకగా.. 40,151 దిగువన కనిష్టానికి చేరింది. ఇక నిఫ్టీ 12,019- 11,776  పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,804 పాయింట్ల వద్ద, తదుపరి 11,668 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 12,046 పాయింట్ల వద్ద, ఆపై 12,154 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్‌ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 24,215 పాయింట్ల వద్ద, తదుపరి 23,796 వద్ద సపోర్ట్‌ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 24,939 పాయింట్ల వద్ద, తదుపరి 25,243 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,108 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 1,634 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1,585 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1,633 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1,657 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 1,622 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు