మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్-19, భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

23 Dec, 2022 10:17 IST|Sakshi

ఈ వారంలో వరుస నాలుగో రోజు జాతీయ, అంతర్జాతయ స్థాయిలో నెలకొన్న ప్రతికూల అంశాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో శుక్రవారం స్టాక్‌ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేలా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు పెంపును కొనసాగించాల్సిన అవసరం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన మదుపర్లు వాల్‌ స్ట్రీట్‌లో తమ  పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు మొగ్గు చూపారు. ఏసియన్‌ మార్కెట్లు సైతం నష్టాల బాట పట్టాయి.  

చైనాలో కరోనా విజృంభిస్తోంది. కేసులు ఒక్కసారిగా పెరగడానికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్7(BF.7) కారణమని నిపుణులు అభిప్రాయం చేస్తున్నారు. దీనికి తోడు ఈ కొత్త 4 వేరియంట్‌ కేసులు భారత్‌లో నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. కొవిడ్‌ను వ్యాప్తిని అరికట్టేలా జాగ్రత్తలు చెబుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ ఎత్తున నష్టపోతున్నాయి. శుక్రవారం ఉదయం 10.5గంటల సమయానికి సెన్సెక్స్‌ 537 పాయింట్లతో భారీగా నష్టపోయి  60288 వద్ద.. నిఫ్టీ 167 పాయింట్లు నష్టపోయి 17959 వద్ద కొనసాగుతుంది. 

అదానీ పోర్ట్స్‌, టాటా మోటార్స్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, హీరోమోటో కార్ప్‌ షేర్లు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. 

కోవిడ్‌ -19 వ్యాప్తి వార్తల నేపథ్యంలో దివిస్‌ ల్యాబ్స్‌, సిప్లా, సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, అపోలో హాస్పిటల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 
 

మరిన్ని వార్తలు