కార్‌ డ్రైవ్‌ చేస్తూ వీడియో గేమ్‌ ! ఎలన్‌ మస్క్‌ ఏమైంది నీకు?

9 Dec, 2021 18:42 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ వెహికల్‌ సెగ్మెంట్‌లో ప్రపంచ నబంర్‌ వన్‌గా ఉన్న టెస్లా కంపెనీ సరికొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. టెక్నాలజీ ప్రియులకు ఈ ఫీచర్‌ పట్ల ఇంట్రస్ట్‌ చూపిస్తున్నా మిగిలిన అన్ని వర్గాల నుంచి విమర్శలు తలెత్తుతున్నాయి. 

ఆటో పైలెట్‌తో మొదలు
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలన్‌ మస్క్‌కి చెందిన టెస్లా కంపెనీ కేవలం ఎలక్ట్రిక్‌ కార్లనే తయారు చేస్తుంది. అయితే ఈ కంపెనీ ఓనర్‌ ఎలన్‌మస్క్‌కి లేటెస్ట్‌ టెక్నాలజీ అంటే వల్లమానిన అభిమానం. అందువల్లే డ్రైవర్‌ లెస్‌ కారుని తెస్తానంటూ ఎప్పటి నుంచో ప్రకటనలు ఇస్తున్నాడు. ఆటోపైలట్‌ ప్రాజెక్టుపై ఏళ్ల తరబడి పరిశోధనలు కొనసాగుతున్నా ఇంత వరకు ఈ లోప రహితమైన ‘ఆటో పైలెట్‌’ అందుబాటులోకి రాలేదు. 

అప్‌డేట్‌తో అందుబాటులోకి
ఓ వైపు ఆటోపైలెట్‌ టెక్నాలజీ పరిశోధనల దశలో ఉండగానే వీడియో గేమ్‌ ఫీచర్‌ని కారులో అందుబాటులోకి తెచ్చింది టెస్లా.  ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న టెస్లా కార్లు అన్నింటికీ ఓవర్‌ ది ఎయిర్‌ ద్వారా ఈ  వీడియో గేమ్‌ అప్‌డేట్‌ అందించారు. దీని ప్రకారం కారు డ్యాష్‌బోర్డు సెంట్రల్‌లో ఉన్న టచ్‌ స్క్రీన్‌ మీద వీడియో గేమ్స్‌ ఆడుకునే వెసులుబాటు వచ్చింది.  డ్రైవర్‌తో పాటు కారులో ప్రయాణించే వ్యక్తులు కారులో ప్రయాణిస్తూ వీడియో గేమ్స్‌ ఆడుకోవచ్చు.  

హెచ్చరిక
డ్రైవింగ్‌ చేస్తూ వీడియో గేమ్స్‌ ఆడే ఫీచర్‌ అందుబాటులోకి తేవడం పట్ల నేషనల్‌ హైవే ట్రాఫిక్‌ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. టెక్నాలజీకి వ్యతిరేకం కానప్పటికీ... డ్రైవర్‌ దృష్టి మళ్లించే వ్యవహరాల విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందంటూ సుతి మెత్తని హెచ​​​‍్చరికలు జారీ చేసింది. ఆటోపైలెట్‌ ఫీచర్‌ వల్ల టెస్లా కార్లు గతంలో చేసిన ప్రమాదాలపై ఇప్పటికే ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ విచారణ చేపడుతోంది.

అలా అయితే ఓకే
వీడియో గేమ్‌ ఫీచర్‌ పట్ల వస్తున్న మిశ్రమ స్పందన పట్ల టెస్లా నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా కొందరు యూజర్లు ఈ ఫీచర్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు. మరికొందరు గతంలోలాగా కారు ఐడిల్‌లో ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేదు కానీ నడుస్తున్నప్పుడు ఈ ఫీచర్‌ వల్ల ఇబ్బందులు వస్తాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: భారత్‌ దెబ్బకు..దారికొచ్చిన ఎలన్‌ మస్క్‌..!

>
మరిన్ని వార్తలు