యూనియన్‌ బ్యాంక్‌ లాభం రెట్టింపు

28 Oct, 2023 06:29 IST|Sakshi

క్యూ2లో రూ.3,511 కోట్లు

మెరుగుపడిన ఆస్తుల నాణ్యత

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి (క్యూ2) మెరుగైన పనితీరు చూపించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు రెట్టింపై రూ.3,511 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.1,848 కోట్లుగానే ఉంది. మొత్తం ఆదాయం రూ.22,958 కోట్ల నుంచి రూ.28,282 కోట్లకు దూసుకుపోయింది.

నిర్వహణ లాభం సైతం రూ.6,577 కోట్ల నుంచి రూ.7,221 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.19,682 కోట్ల నుంచి రూ.24,587 కోట్లకు చేరగా, నికర వడ్డీ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.9,126 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్‌ 3.15 శాతం నుంచి 3.18 శాతానికి పెరిగింది. బ్యాంకు ఆస్తుల (రుణాలు) నాణ్యత మెరుగుపడింది. స్థూల ఎన్‌పీఏలు 6.38 శాతానికి క్షీణించాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికం చివరికి ఇవి 8.45 శాతంగా ఉన్నాయి. నికర ఎన్‌పీఏలు సైతం 1.30 శాతానికి పరిమితమయ్యాయి.

క్రితం ఏడాది ఇదే కాలానికి ఇవి 2.64 శాతంగా ఉన్నాయి. బ్యాంక్‌ క్యాపిటల్‌ అడెక్వెసీ రేషియో 16.69 శాతానికి మెరుగుపడింది. కాసా రేషియో (కరెంట్, సేవింగ్స్‌ ఖాతాలు) 35.64 శాతం నుంచి 34.66 శాతానికి తగ్గింది. సెపె్టంబర్‌ క్వార్టర్‌లో అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు (క్యూఐపీ) ద్వారా రూ.5,000 కోట్లను సమీకరించినట్టు బ్యాంక్‌ తెలిపింది. దీంతో బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వం వాటా 83.49 శాతం నుంచి 76.99 శాతానికి తగ్గింది. 

మరిన్ని వార్తలు