కూ.. చుక్‌ చుక్‌, వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్.. ఎందుకీ రైలు ప్రత్యేకమో తెలుసా!

18 Jan, 2023 12:51 IST|Sakshi

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది సెమీ-హై స్పీడ్ రైలు. ఇది 18 నెలల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ కింద ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) చెన్నైలో దీన్ని నిర్మించింది.

ఇది భారతదేశపు మొట్టమొదటి ఇంజిన్‌లెస్,  స్వీయ చోదక రైలుగా ప్రత్యేకత గుర్తింపు సంపాదించుకుంది. ఇది 200-210 KMPH గరిష్ట వేగాన్ని అందుకోగలదు. ట్రయల్స్ సమయంలో ఇది గరిష్టంగా 180 KMPH స్పీడ్‌తో ప్రయాణించింది. అయితే, భారతీయ రైల్వే ప్రయాణీకులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ దాని ఆపరేషనల్‌ స్పీడ్‌ను 130KMPHకి పరిమితం చేసింది.


ఇందులోని వసతులు గురించి చెప్పాలంటే..
ఈ రైళ్లు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక ఇంటీరియర్‌తో నిర్మితమైంది. ప్రయాణీకుల కోసం ప్రతి కోచ్‌లో గ్లాస్-బాటమ్ లగేజ్ ర్యాక్‌ను అందుబాటులో ఉంచారు.  రైలులో 'ఎగ్జిక్యూటివ్ క్లాస్',  'చైర్ కార్' ఉన్నాయి. ఈ కోచ్‌లు ప్రయాణికులకు విలాసవంతమైన సౌకర్యాలను అందిస్తాయి. 

మధ్యలో గల రెండు కోచ్‌లు మొదటి తరగతి కోచ్‌లు, ఇవి 52 సీటింగ్‌ సామర్థ్యం కలిగి ఉంటాయి. మిగిలిన కోచ్‌ల్లో మాత్రం విమానం మాదిరిగా 78 రిక్లైనింగ్‌ సీట్లు ఉంటాయి.  ఈ కోచ్‌ల పొడవు 23 మీటర్లు, మొత్తం రైలు ఫ్రేమ్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో నిర్మించబడింది. ఈ రైలు బయట నుంచి చూడడానికి విమానాన్ని పోలి ఉంటుంది.

మిగిలిన రైలు కోచ్‌ల కంటే ఇవి తేలికైనవి. మొత్తం 16 కోచ్‌లు, 1128 సీటింగ్‌ సామర్ధ్యం, మొత్తం శీతల కోచ్‌లు. 360 డిగ్రీలు తిరిగే సౌకర్యవంతమైన సీట్లు, వ్యక్తిగత రీడింగ్ లైట్లు, వ్యక్తిగత ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లు, వ్యక్తిగత మొబైల్ ఛార్జింగ్ పాయింట్‌లు, సెంట్రలైజ్డ్ కంట్రోల్ ఆటోమేటిక్ డోర్ సిస్టమ్‌లు, అధునాతన రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌లు, చైన్ పుల్లింగ్ సిస్టమ్ లేదు వీటితో మరెన్నో ఉన్నాయి.

చదవండి: ఇది అసలు ఊహించలేదు.. 50 ఏళ్లలో ఇది రెండో సారి, దారుణంగా చైనా పరిస్థితి!

మరిన్ని వార్తలు