విజయంతో ముగించేందుకు

3 Dec, 2023 00:39 IST|Sakshi

నేడు భారత్, ఆస్ట్రేలియా చివరి టి20 మ్యాచ్‌

రా.గం.7 నుంచి స్పోర్ట్స్‌18,జియో సినిమాలో ప్రసారం

బెంగళూరు: భారత్, ఆ్రస్టేలియా టి20 సిరీస్‌ ఆఖరి మజిలీకి చేరింది. మరో గెలుపుతో సిరీస్‌ ఆధిక్యాన్ని 4–1కు చేర్చుకోవాలిన టీమిండియా చూస్తుంటే... సిరీస్‌ ఎలాగూ చేజారింది కాబట్టి విజయంతోనైనా ముగింపు పలికి తిరుగుముఖం పట్టాలని కంగారూ సేన భావిస్తోంది. అయితే జట్ల బలాబలాల విషయానికొస్తే మాత్రం సూర్యకుమార్‌ సేనే పటిష్టంగా కనిపిస్తోంది.

సిరీస్‌ ఇదివరకే సాధించడం, బౌలర్లు ఫామ్‌లోకి రావడం ఆతిథ్య భారత్‌ను దుర్బేధ్యంగా మార్చింది. వన్డే ప్రపంచకప్‌ సాధించిన ఆసీస్‌ జట్టు సభ్యుల్లో ఒక్క ట్రవిస్‌ హెడ్‌ తప్ప మిగిలిన 10 మంది ఆటగాళ్లంతా కొత్తవారే కావడం, నిలకడ లోపించడం కంగారూను మరింత కలవరపెడుతోన్న అంశం.

బౌలింగ్‌ బలగం 
గత నాలుగు మ్యాచ్‌ల్ని నిశితంగా గమనిస్తే భారత్‌ బ్యాటింగ్‌ జోరుతో తొలి మూడు టి20ల్లో అవలీలగా 200 పైచిలుకు పరుగులు చేసింది. యశస్వి, రుతురాజ్, కెపె్టన్‌ సూర్యకుమార్, రింకూ సింగ్‌ ఇలా వీరంతా మెరిపించినవారే! కానీ బౌలింగ్‌ వైఫల్యంతో భారీ స్కోరు చేశాక కూడా మూడో టి20లో భారత్‌ ఓడింది.

అయితే నాలుగో మ్యాచ్‌లో మాత్రం గత మ్యాచ్‌లకు భిన్నంగా తక్కువ స్కోరు చేసినా టీమిండియా సిరీస్‌ విజయాన్ని అందుకుంది. దీనికి బౌలింగ్‌ పదును పెరగడమే కారణం. అక్షర్‌ పటేల్, రవి బిష్ణోయ్‌ల స్పిన్, దీపక్‌ చహర్‌ పేస్‌లతో భారత్‌ బౌలింగ్‌ బలం పెరిగింది. ఇప్పుడు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఏమాత్రం ఒత్తిడి లేని ఆఖరి మ్యాచ్‌లో గెలవడం కష్టం కానేకాదు.

గత మ్యాచ్‌లో హిట్టర్‌ జితేశ్‌ శర్మ కూడా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. చివరి రెండు మ్యాచ్‌ల కోసం వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ గత మ్యాచ్‌ వైఫల్యాన్ని అధిగమించే పనిలో పడితే మాత్రం భారత్‌ మరో 200 పరుగుల్ని చేయడం ఇంకాస్త సులువవుతుంది.

ఒత్తిడిలో ఆసీస్‌ 
నాలుగో టి20లో టాస్‌ నెగ్గినప్పటికీ ఆస్ట్రేలియా తమ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై నమ్మకంతో చేజింగ్‌ ఎంచుకొని భంగపడింది. దీంతోనే సిరీస్‌నూ కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆ్రస్టేలియాపైనే సిరీస్‌ ఆధిక్యాన్ని తగ్గించాలనన్న ఒత్తిడి భారంగా మారింది.

హెడ్‌ మెరిపిస్తున్నా... ఫిలిప్, హార్డీ, టిమ్‌ డేవిడ్‌ల నుంచి ఆశించినంత సహకారం లభించకపోవడం బ్యాటింగ్‌ ఆర్డర్‌ను ఆందోళన పరుస్తోంది. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వన్డే జట్టు విజయంతో ఇంటికెళ్లినట్లే... టి20 జట్టు సిరీస్‌తో కాకపోయినా... ఆఖరి ఫలితంతో సంతృప్తిగా స్వదేశం వెళ్లాలంటే ఆటగాళ్లంతా మరింత బాధ్యత కనబరచాల్సి వుంటుంది.

పిచ్‌–వాతావరణం 
ఇక్కడి చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్‌కు బాగా కలిసొచ్చే గ్రౌండ్‌. ప్రతీసారి కూడా బౌండరీలు, సిక్సర్ల మజాను పంచుతోంది. కాబట్టి టాస్‌ గెలిస్తే ఏ జట్టయినా ఛేదనకే మొగ్గు చూపుతుంది. ఆటకు వాన ముప్పు లేదు.

జట్లు (అంచనా) 
భారత్‌: సూర్యకుమార్‌ (కెపె్టన్‌), యశస్వి జైస్వాల్, రుతురాజ్, శ్రేయస్‌ అయ్యర్, జితేశ్‌ శర్మ, రింకూ సింగ్, అక్షర్‌ పటేల్, దీపక్‌ చహర్, రవి బిష్ణోయ్, అవేశ్‌ఖాన్, ముకేశ్‌.  
ఆ్రస్టేలియా: మాథ్యూ వేడ్‌ (కెపె్టన్‌), ఫిలిప్, హెడ్, మెక్‌డెర్మాట్, అరోన్‌ హార్డీ, టిమ్‌ డేవిడ్, షార్ట్, డ్వార్‌షుయిస్, క్రిస్‌ గ్రీన్, బెహ్రెన్‌డార్‌్ఫ, తనీ్వర్‌ సంఘా/నాథన్‌ ఎలిస్‌.

మరిన్ని వార్తలు