Revised ITR: రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలా? చివరి తేదీ ఎపుడు?

10 Aug, 2022 11:37 IST|Sakshi

సాక్షి, ముంబై:  2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ ( ఐటీఆర్‌) ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31తో ముగిసింది.   కేంద్రం ఈ సారి గడువు తేదీని పొడిగించకపోవడంతో, గడుపు పొడిగింపు లభిస్తుందిలే అని ఆశించిన పన్ను చెల్లింపుదారులుకునిరాశే ఎదురైంది. దీంతో చాలా మంది పన్ను చెల్లింపుదారులు కొన్ని హడావిడిగా ఫైల్‌ చేయడంతో  అవాంఛిత తప్పులు  దొర్లి ఉండవచ్చు.

ఈ నేపథ్యంలో ఇటువంటి తప్పులను, పొరబాట్లను సరిదిద్దుకునేందుకు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139(5) ప్రకారం  రివైజ్డ్ ఐటీఆర్ దాఖలుకు పన్ను చెల్లింపుదారులకు అవకాశం ఉంది. ఇలా మళ్లీ ఐటీఆర్ దాఖలు చేయాలని భావిస్తున్నవారు ఆన్‌లైన్‌లోనే ఈ పని పూర్తి చేయొచ్చు. అయితే రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మీరు ఒరిజినల్ రిటర్న్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. సవరించిన రిటర్న్‌ను ఫైల్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2022.

రివైజ్డ్  ఐటీఆర్‌ ఎవరు దాఖలు చేయవచ్చు
ఐటీఆర్‌ దాఖలు చేసిన ప్రతి మదింపుదారుడు సెక్షన్ 139(5) కింద  దీన్ని సవరించుకోవడానికిఅర్హులు. ఆలస్యంగా ఐటిఆర్ ఫైల్ చేసిన వారు కూడా, అంటే, గడువు ముగిసిన తర్వాత ఐటిఆర్ ఫైల్ చేయబడితే, రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేయవచ్చు.

రివైజ్డ్ రిటర్న్ ఎలా దాఖలు చేయాలి
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ డేటాను సరిచేసుకోవాలంటే  ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌కు లాగిన్‌ అవ్వాలి
మీ అకౌంట్ డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది. 'రిటర్న్ ఫైల్ అండర్' కాలమ్‌లో రివైజ్డ్ u/s 139(5) అనే ఆప్షన్ ఎంచుకోవాలి. 
అక్కడ అసెస్‌మెంట్ ఇయర్ ఎంచుకుని  సీపీసీ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
తరువాత  పాన్ నెంబర్ కూడా ఎంటర్‌ చేసి వాలిడేట్‌పై క్లిక్ చేయాలి. 
ఇప్పుడు రెక్టిఫికేషన్ రిక్వెస్ట్ టైప్ చేసుకోవాలి. రెక్టిఫికేషన్ చేయాల్సి వచ్చిందో కూడా కారణం తెలియజేయాలి.
మొత్తం ఆప్షన్లలో గరిష్టంగా 4 కారణాలను మాత్రమే ఎంచుకోవాలి. తర్వాత ట్యాక్స్ క్రెడిట్ మిస్‌మ్యాచ్ డీటైల్స్‌పై క్లిక్ చేయాలి. తర్వాత చివరిగా సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.

ఎన్ని సార్లు ఫైల్‌ చేయవచ్చు
రివైజ్డ్ రిటర్న్‌ను ఎన్నిసార్లు ఫైల్ చేయవచ్చో పరిమితి లేదు. అయితే, ఈ సదుపాయాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఐటీ డిపార్ట్‌మెంట్ ఆగస్టు 1, 2022 నుండి, ఐటీఆర్‌ని ధృవీకరించడానికి 120 రోజుల ముందు ఉన్న కాల పరిమితిని 30 రోజులకు తగ్గించింది. కనుక ఒకసారి రిటర్నులు ధ్రువీకరించినదీ, లేనిదీ చూసుకోవాలి. వెరిఫికేషన్‌ చేయని రిటర్నులు చెల్లవు. రిటర్నులు సమర్పించిన తేదీ నుంచి 30 రోజుల్లోపు ధ్రువీకరించేందుకు సమయం ఉంటుంది. ధృవీకరణకు అందుబాటులో ఉన్న 6 పద్ధతుల్లో దేనినైనా ఉపయోగించవచ్చు. నెట్‌ బ్యాంకింగ్‌ నుంచి లేదంటే ఆధార్‌ ఓటీపీ ద్వారా, బ్యాంకు లేదా డీమ్యాట్‌ ఖాతా నంబర్‌ సాయంతోనూ వెరిఫై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వీటిల్లో మీకు నచ్చిన ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు యూజర్‌ మొబైల్‌కు వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ వస్తుంది. ఈ కోడ్‌ లేదా ఓటీపిని ఈఫైలింగ్‌ పోర్టల్‌పై ఎంటర్‌ చేసి, సబ్మిట్‌ కొట్టడంతో ఈ వెరిఫికేషన్‌ పూర్తవుతుంది.

మరిన్ని వార్తలు