7 దేశాల యూజర్లకు షాక్‌.. మరింత కాస్ట్లీగా యూట్యూబ్‌

4 Nov, 2023 10:01 IST|Sakshi

టెక్‌ దిగ్గజం గూగుల్‌కు చెందిన వీడియో షేరింగ్‌ దిగ్గజం యూట్యూబ్‌ యూజర్లకు షాకిచ్చింది. ఆదాయమార్గాల్ని అన్వేషిస్తున్న యూట్యూబ్‌ పలు దేశాల్లో యూట్యూబ్‌ ప్రీమియం ధరల్ని మరింత పెంచింది. పెంచిన ధరలతో యూట్యూబ్‌ కొన్ని దేశాల్లో మరింత కాస్ట్లీగా మారింది. వాటిల్లో భారత్‌ లేకపోవడం గమనార్హం. 

ఎక్కువ యాడ్స్‌ ఉంటే యూట్యూబ్‌కి ఆదాయం పెరుగుతుంది. అయితే,  యూజర్లు యూట్యూబ్‌లో యాడ్స్‌ లేకుండా వీడియోలు చూడటానికి యాడ్‌ బ్లాకర్లను వాడుతుంటారు. దీంతో ఆదాయం తగ్గడంతో యాడ్‌ బ్లాకర్స్‌ని వినియోగిస్తున్న యూజర్లను బ్లాక్‌ చేసేలా కొత్త మెకానిజంను తయారు చేసింది.

ఈ టెక్నాలజీ రాకతో ప్రపంచవ్యాప్తంగా యాడ్‌ బ్లాకర్లను వినియోగించే వారికి ‘యాడ్‌ బ్లాకర్లను వినియోగిస్తే యూట్యూబ్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లే. యాడ్‌ బ్లాకర్లను వాడొద్దని ఇప్పటికే సూచించాం. ఒక వేళ ప్రకటనలు రాకుండా వీడియోలు చూడాలంటే ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది’ అని మెసేజ్‌లు పంపిస్తుంది.

నవంబర్‌ 1 నుంచే అమలు
తాజాగా, 9 టూ 5 గూగుల్‌ నివేదిక ప్రకారం.. అర్జెంటైనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, చీలీ,జర్మనీ, పోలాండ్‌, టర్కీ ఈ 7 దేశాలకు చెందిన యూజర్లకు యూట్యూబ్‌ మెయిల్స్‌ పంపింది. య్యూట్యూబ్‌లో ప్రీమియం ధరల్నిపెంచుతున్నట్లు ఆమెయిల్స్‌లో పేర్కొంది. ఈ పెరిగిన ధరలు నవంబర్‌ 1 నుంచి అందుబాటులోకి వచ్చినట్లు స్పష్టం చేసింది.


ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్‌ సేవల్ని వినియోగిస్తున్న యూజర్లు మరో మూడు నెలల వరకు పాత సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను చెల్లించే అవకాశం కల్పిస్తూనే.. కొత్తగా వచ్చి చేరే పెయిడ్‌ యూజర్లు మాత్రం పెంచిన ధరలు వర్తిస్తాయని చెప్పింది. అయితే, పెంచిన ధరలు ఎంతనేది తెలియాల్సి ఉంది. 

భారత్‌లో యూట్యూబ్‌ ప్రీమియం ధరలు
భారతదేశంలో యూట్యూబ్‌ ప్రీమియం ధరలు స్థిరంగానే ఉన్నాయి. సంస్థ ప్రస్తుతం చందాదారుల నుండి  నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ధర రూ. 139, మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 399, ఏడాది సభ్యత్వానికి  ధర రూ. 1,290ని వసూలు చేస్తుంది. తద్వారా యూజర్లు యూట్యూబ్‌లో వీడియోల్ని వీక్షించే సమయంలో ఎలాంటి యాడ్స్‌ డిస్‌ప్లే అవ్వవు.

చదవండి👉 ‘నీవ్వు వద్దూ.. నువ్విచ్చే జీతం వద్దంటూ’

మరిన్ని వార్తలు