ముగ్గురు పూజారుల తలలు ఛిద్రం చేసి..

11 Sep, 2020 15:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం

బెంగళూరు: కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ముగ్గురు పూజారులను అత్యంత పాశవికంగా హత్య చేశారు. బండరాళ్లతో తలలను ఛిద్రం చేసి కర్కశంగా వ్యవహరించారు. ఈ ఘటన మండ్య పట్టణ శివారులో గల ఓ ఆలయంలో చోటుచేసుకుంది. కాగా శుక్రవారం ఉదయం గుడి ప్రాంగణంలో పడి ఉన్న మృతదేహాలను చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. స్థానిక గుట్టలు ప్రాంతంలోని శ్రీ అరకేశ్వర ఆలయంలో గణేష్‌, ప్రకాశ్‌, ఆనంద్‌ పౌరోహిత్యం చేస్తున్నారు. వీరు ముగ్గురు బంధువులు. భద్రతా కారణాల దృష్ట్యా రోజూ ఆలయ ప్రాంగణంలోనే నిద్రిస్తారు. ఈ క్రమంలో శుక్రవారం గుడికి వెళ్లిన భక్తులకు విగతజీవులుగా కనిపించారు. (చదవండి: ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య)

ఇక హుండీలు పగులగొట్టి ఉండటం చూస్తుంటే డబ్బు, నగలు, కానుకల కోసమే దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. సదరన్‌ రేంజ్‌ ఐజీపీ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షించారు. కాగా ఇప్పటివరకు హంతకులకు సంబంధించి ఎలాంటి ఆధారం దొరకలేదని పోలీసులు వెల్లడించారు. జాగిలాలను రంగంలోకి దింపామని, ఫోరెన్సిక్‌ నిపుణులు కూడా క్రైంసీన్‌లో సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నారని తెలిపారు. కాగా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి యడ్యూరప్ప మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

మరిన్ని వార్తలు