ఏటీఎం చోరీలు..నిందితుల హిస్టరీ చూస్తే..

24 Dec, 2020 14:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గత కొన్ని రోజులుగా రాచకొండ పరిధిలో జరుగుతున్న వరుస ఏటీఎం చోరీలపై నిఘా ఉంచామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. గ్యాస్ కట్టర్తో ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బు దొంగలిస్తున్నారని, అబ్దుల్లాపూర్మెట్‌లో ఒక పోలీస్  వాహనం దొంగలించి ఏటీఎం చోరీ చేసినట్లు చెప్పారు. ఇప్పటికే దుండగులను గుర్తించామని, వీరంతా హర్యానాలోని మోహత్‌ ప్రాంతానికి  చెందిన వారని పేర్కొన్నారు. ఈ గ్యాంగ్ దేశ వ్యాప్తంగా చోరీలకు పాల్పడుతున్నారని, ఇప్పటివరకు వీరిపై 11 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసులో మొత్తం 6గురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. (అగ్రిగోల్డ్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం)

'ఈనెల 15న నాచారంలో రెండు ఇళ్లలో చోరీ జరిగి, 35 వేల 800 నగదు పోయాయని ఫిర్యాదు వచ్చింది. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరాను పరిశీలించగా, ఓ వ్యక్తిపై అనుమానం కలిగింది. ఇందులో మహమ్మద్ సద్దర్ అనే వ్యక్తి వేలిముద్రలు లభించాయి. 2015 నుంచి ఇతను దాదాపు 33 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు  తేలింది. జైలులో ఉండగానే మొయినాబాద్‌కి  చెందిన ఆయుబ్తో సద్దార్ కు జైల్లో పరిచయం అయింది. వీరిద్దరూ కలిసి వరుస దొంగతనాలు చేస్తున్నారు. ఇప్పటికే 118 కేసుల్లో నిందితుడైన ఆయూబ్‌పై 19 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి. ముఖ్యంగా లోకల్‌ వ్యక్తుల పరిచయాలతో వీరు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించాం.  కొందరు లారీ డ్రైవర్లు కూడా వీరికి సహకరిస్తున్నట్లు తేలింది. వీరి నుంచి 42తులాల బంగారు ఆభరణాలు, 70తులాల వెండి, 36వేల నగదు, ఒక మారుతి కారు స్వాధీనం చేసుకున్నాం' అని  సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. ఏటీఎం సెంటర్లలో గ్యాస్‌ కట్టర్‌తో వరుస చోరీలు చేస్తున్నారని, ఈ సందర్భంగా ప్రతి ఏటీఎం  వద్ద సెక్యూరిటీలను, అలారం సిస్టమ్‌ను  పెట్టుకోవాలని బ్యాంక్  అధికారులకు ఆయన  విజ్ఞప్తి చేశారు.  (పెళ్లి మంటపంపైనే నగలు చోరీ )


 

మరిన్ని వార్తలు