ఢిల్లీ వీధుల్లో దారుణం

28 Jan, 2022 05:24 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో మరో దారుణం బుధవారం మధ్యాహ్నం జరిగింది. తమ కుటుంబంలో యువకుడి ఆత్మహత్యకు కారణమని ఆరోపిస్తూ 20ఏళ్ల యువతిని కొందరు నిర్భంధించి లైంగిక దాడి జరిపారు. అనంతరం అత్యాచార బాధితురాలిని నిందితులు తీవ్రంగా హింసిస్తూ కస్తూర్బా నగర్‌ వీధుల్లో  నడిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమై కలకలం సృష్టించాయి.

యువతి ముఖానికి నల్లరంగు పూసి, జుట్టు కత్తిరించి, మెడలో చెప్పు వేలాడదీసి నిందితులు అవమానించడం వీడియోల్లో కనిపించింది. ఈ ఘటనలో పాల్గొన్నారని భావిస్తున్న 11మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఏడుగురు మహిళలు కాగా నలుగురు పురుషులు. 11మందిలో ఇద్దరు 18ఏళ్లలోపు వారు కావడం గమనార్హం. బాధిత యువతి భర్తతో కలిసి ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో నివసిస్తుంది. ఆమె పుట్టిల్లు కస్తూర్బా నగర్‌లో ఉంది.

నిందితుల కుటుంబంలోని ఒక కుర్రాడితో ఆమెకు స్నేహం ఉందని, గత నవంబర్‌లో ఆ కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఇందుకు ఈ యువతే కారణమని నిందితులు ఆరోపిస్తున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రతీకారం కోసం వేచి చూసిన నిందితులు గుణపాఠం నేర్పాలంటూ సదరు యువతిని అపహరించారన్నారు. ఆమెపై లైంగిక దాడి జరిపారని తెలిపారు. ఘటన సమాచారం తెలియగానే స్పందించామని, బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఐపీసీలోని 12 సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు