బ్లేడుతో తల్లి బెదిరింపు.. తానే కోసుకున్న బాలుడు

17 Feb, 2021 08:20 IST|Sakshi

సాక్షి, మణికొండ: గేమ్స్‌ ఆడుకునేందుకు ఫోన్‌ ఇవ్వాలని కుమారుడు విసిగిస్తుండటంతో భయపెట్టడానికి తల్లి కుమారుడి కాళ్లను బ్లేడ్‌తో చిన్నగా కోసింది. అయితే తానే కోసుకుంటానంటూ ఆ బాలుడు బ్లేడుతో గాయాలు చేసుకున్నాడు. ఈ ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గంధంగూడ జేఎన్‌ఎన్‌ఆర్‌ఎంయూ కాలనీలో సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గంధంగూడలో ఉంటున్న చంద్రకళ కూలీపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఏడో తరగతి చదువుతున్న ఆమె కుమారుడు శంకర్‌(12).. సోమవారం రాత్రి  ఫోన్‌ ఇవ్వాలని గొడవచేయసాగాడు.

విసిగివేసారిన ఆమె భయపెట్టాలని భావించి బ్లేడ్‌తో కాలిపై చిన్నగా కోసింది. అయితే, తానే కోసుకుంటానని అదే బ్లేడ్‌ తీసుకుని పలుమార్లు శంకర్‌ కోసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పైగా తన తల్లి ఫోన్‌ ఇవ్వనందుకు తానే బ్లేడుతో కోసుకున్నానని శంకర్‌ పోలీసులకు రాతపూర్వకంగా తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ గంగాధర్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు