అత్యాచార నిందితుడిపై పోలీసుల కాల్పులు.. ఎన్‌కౌంటర్‌ ఎక్కడో తెలుసా..?

16 Mar, 2022 09:52 IST|Sakshi

గువహటి:  ఓ యువతిపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని పోలీసులు మంగళవారం రాత్రి ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ ఘటన ఈశాన్య రాష్ట్రమైన అసోంలో చోటుచేసుకుందని ఏఎన్‌ఐ వార్త సంస్థ ట్విటర్‌లో పేర్కొంది. తాజాగా ఈ ఎన్‌కౌంటర్‌ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సామూహిక లైంగిక దాడిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల్లో ఒక్కడైన బికి అలీ తమ కస్టడీ నుంచి పారిపోయేందుకు రాత్రి సమయంలో ప్రయత‍్నించాడని తెలిపారు. ఈ క్రమంలో స్టేషన్‌లో పోలీసులు అతడికి ఆపే ప్రయత్నం చేయడంలో అలీ తమపై దాడి చేసినట్టు గువాహటి పోలీసులు వెల్లడించారు. లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ అలీ వినకపోవడంతో ఆత్మరక్షణ కోసం అతడిపై కాల్పులు జరిపినట్టు పేర్కొన్నారు. నిందితుడి దాడిలో ఇద్దరు మహిళా పోలీసులు గాయపడినట్టు పోలీసు అధికారులు తెలిపారు.

కాగా, బికి అలీ తన నలుగురు స్నేహితులతో కలిసి గరియాన్‌లోని ఓ హోటల్‌లో ఓ మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు చెప్పారు. అత్యాచారం తర్వాత వారంతా పారిపోయారని తెలిపారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్టు పాన్‌బజార్‌ మహిళా పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ప్రధాన నిందితుడు బికి గురించి సమాచారం తెలియడంతో అతడిని మంగళవారమే అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. మిగిలిన నలుగురు నిందితుల కోసం గాలింపు చర్చలు కొనసాగుతున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు