జైల్లోనే ఆశిష్‌ మిశ్రా

12 Feb, 2022 06:07 IST|Sakshi

లక్నో: లఖీంపూర్‌ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడు ఆశిష్‌ మిశ్రాకు అలహాబాద్‌ హైకోర్టు బెయిలు మంజూరు చేసినా జైలు నుంచి విడుదల కాలేదు. 2021 అక్టోబర్‌లో ఆశిష్‌ను పోలీసులు సెక్షన్‌ 147, 148, 149, 302, 307, 326, 34, 427, 120బీ కింద అరెస్టు చేశారు. వీటితో పాటు ఆయుధాల చట్టం కింద కూడా ఆశిష్‌పై నేరారోపణ చేశారు. తాజాగా హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌లో 302, 120 బీ సెక్షన్లకు సంబంధించి వివరాల్లేవు.

సెక్షన్‌ 302 హత్యాయత్నంకు సంబంధించినది కాగా 120 బీ సెక్షన్‌ క్రిమినల్‌ కుట్రకు సంబంధించినది. బెయిల్‌ ఆర్డర్‌లో ఈ రెండు చట్టాల గురించి పేర్కొనకపోవడంతో ఆశిష్‌ విడుదల జరగలేదు. దీనిపై స్పందిస్తూ బెయిల్‌ ఆర్డర్‌లో ఈ రెండు సెక్షన్లను కూడా చేర్చాలని హైకోర్టును ఆశ్రయిస్తామని ఆశిష్‌ న్యాయవాది చెప్పారు. రైతు ఆందోళనల సమయంలో నలుగురు రైతుల మరణానికి కారణమయ్యాడని ఆశిష్‌పై కేసు నమోదైంది. బెయిల్‌ కోసం ఆశిష్‌ యత్నిస్తుండగా గురువారం హైకోర్టులో ఊరట దొరికింది.

మరిన్ని వార్తలు