చర్చికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల 

19 Sep, 2022 09:20 IST|Sakshi

నాగోలు: ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలు రూ. లక్ష నగదు దోచుకెళ్లిన ఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు బాధితుల వివరాల ప్రకారం.. నాగోలు బండ్లగూడలోని కేతన ఎన్‌క్లేవ్‌లో ఉండే లాలయ్య, మాదాపూర్‌లో విప్రో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు.

వరసగా రెండ్రోజులు సెలవులు ఉండడంతో భార్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శనివారం అబ్దుల్‌పూర్‌మెట్‌ సమీపంలోని చర్చికి వెళ్లారు. రాత్రి అక్కడ బస చేశారు.  ఆదివారం ఉదయం లాలయ్య ఇంటికి వచ్చే సరికి గ్రిల్స్‌కు ఉన్న తాళం పగలగొట్టి ఉంది లోపలికెళ్లి చూడగా అల్మారా పగల గొట్టి అందులో ఉన్న 49 తులాల బంగారు ఆభరణాలు, రూ. 1 లక్ష నగదు, 8 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

లాలయ్య ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌ టీమ్, పోలీస్‌ డాగ్స్‌తో తనిఖీలు చేసి అక్కడి వేలిముద్రాలు సేకరించారు. కాలనీలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. లాలయ్య ఇంట్లో పనిచేసేవారు తరుచూ ఇంటికి వచ్చే వారిని పోలీసులు విచారిస్తున్నారు. బాధితుడు చర్చికి వెళ్లిన విషయం తెలుసుకున్న వారే చోరీ పాల్పడినట్లు అనుమానం  వ్యక్తం చేస్తున్నారు. 

(చదవండి: కోళ్ల చోరికి వచ్చిన యువకుడిపై దాడి)

మరిన్ని వార్తలు