రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

25 Mar, 2021 20:54 IST|Sakshi

విధులు ముగించుకుని వెళ్తుండగా విషాదం

అల్లవరం/తూర్పుగోదావరి: మండలంలోని గోడితిప్ప సెంటర్‌ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఒకే సంస్థలో పనిచేస్తున్న వారిద్దరూ విధులు ముగించుకుని వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. స్థానికులు, గురుకుల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. గోడిలోని బాలికల గురుకుల పాఠశాలలో పరమట సుధారాణి(42), బాలుర గురుకులంలో సురేష్‌(47) ఔట్‌సోర్సింగ్‌పై కంప్యూటర్‌ ఆపరేటర్లుగా పని చేస్తున్నారు. అమలాపురం నల్లవంతన వద్ద బండివారిపేటలో వీరు ఉంటున్నారు. ఈ దంపతులకు పదమూడేళ్ల పాప ఉంది. రోజూ ఇద్దరూ మోటారుసైకిల్‌పై డ్యూటీకి వస్తుంటారు. 

ఈ క్రమంలో బుధవారం కూడా పాఠశాలలో విధులు ముగించుకుని బైకుపై ఇంటికి బయల్దేరారు. గోడితిప్ప సెంటర్‌ దాటిన తర్వాత మంగాయమ్మ ఆస్పత్రికి సమీపంలోని బెండమూర్లంక వైపు వేగంగా వచ్చిన ఆటో వీరిని ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తల్లిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. కాసేపటి తర్వాత సుధారాణి మృతి చెందగా, సురేష్‌ను 108 వాహనంలో అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరైగన చికిత్స కోసం సురేష్‌ని కిమ్స్‌కు తీసుకువెళ్లారు. అయితే, చికిత్స సమయంలో గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లిదండ్రులు మృతిచెందడంతో వారి ఏకైక కుమార్తె అనాథ అయ్యింది. కాగా ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్‌ను స్థానికులు వెంబడించి పోలీసులకు అప్పగించగా దర్యాప్తు చేపట్టారు.

చదవండి: పని చేయాలని చెప్పడమే పాపమైంది..

మరిన్ని వార్తలు