గేదె గడ్డి మేసిన వివాదం, సోదరుడిపై హత్యాయత్నం

26 Mar, 2021 10:28 IST|Sakshi
దాడిలో గాయపడిన రమేష్‌

సోదరుల మధ్య మాటామాటా పెరిగి కొడవలితో హత్యాయత్నం 

పోలీసుల అదుపులో బాల్‌రాజ్‌

రాజేంద్రనగర్‌లో ఘటన  

సాక్షి, రాజేంద్రనగర్‌: గేదెలు వ్యవసాయ వర్సిటీలో గడ్డిమేసిన విషయమై ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాస్తా హత్యాయత్నానికి దారితీసింది.. బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఏసీపీ సంజయ్‌కుమార్‌ తెలిపారు. వివరాలు.. రాజేంద్రనగర్‌ ప్రాంతానికి చెందిన ఎం.బాల్‌రాజ్‌ అలియాస్‌ బాలయ్య (38), ఎం.రమేష్‌(37) వరుసకు సోదరులు. రమేష్‌కు చెందిన 3 గేదెలు బుధవారం రాత్రి వ్యవసాయ వర్సిటీలో గడ్డిమేశాయి. ఈ విషయాన్ని బాలయ్య వర్సిటీ అధికారులకు తెలపడంతో రమేష్‌కు అపరాధరుసుం విధించారు. ఇదేవిషమై గురువారం ఎన్‌ఐఆర్‌డీ కమాన్‌ వద్ద బాల్‌రాజ్, రమేష్‌ మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు.

బాల్‌రాజ్‌ తనవెంట తెచ్చుకున్న కొడవలితో రమేష్‌పై దాడి చేశాడు. స్థానికులు బాల్‌రాజ్‌ను నియంత్రించి కొడవలిని లాగివేయడంతో ప్రమాదం తప్పింది.తీవ్రంగా గాయపడ్డ రమేష్‌ను ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా బాల్‌రాజ్‌.. రమేష్‌పై దాడి చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న రాజేంద్రనగర్‌కు చెందిన నారాయణ, నరేష్‌ ధైర్యంగా ముందుకు వెళ్లి బాల్‌రాజ్‌ను అడ్డుకుని గాయపడ్డ రమేష్‌ను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్‌ ఏసీపీ సంజయ్‌కుమార్‌ వారిని అభినందించారు.  

గతంలో బాల్‌రాజ్‌పై హత్యారోపణలు.. 
కాగా బాల్‌రాజ్‌పై గతంలో రెండు హత్యారోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి. రాజేంద్రనగర్‌ ప్రాంతంలో బాల్‌రాజ్‌ నిత్యం మద్యం తాగి దౌర్జన్యం చేయడంతో పాటు దాడులకు పాల్పడుతూ ఉండేవాడని స్థానికులు తెలిపారు. సోదరుడిపై దాడిచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు