డిప్యూటీ కలెక్టర్‌ వికృత చేష్టలు.. ఆకస్మిక తనిఖీల పేరుతో.. బాలికల గదిలోకి వెళ్లి.. మంచంపై

12 Jul, 2023 13:41 IST|Sakshi

భోపాల్‌: ఆకస్మిక తనిఖీల పేరుతో సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ హోదాలో ఉన్న ఓ ప్రభుత్వ అధికారి వసతిగృహ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఝాబువా జిల్లాలో చోటు చేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌డీఎం సునీల్ కుమార్ ఝా ఆదివారం బాలికల ఆశ్రమం ఝబువా హాస్టల్‌కు ఆకస్మిక తనిఖీ కోసం వెళ్లారు. అక్కడికి వెళ్లగానే హాస్టల్ సూపరింటెండెంట్‌ని గది బయటే ఉండమని.. బాలికలతో తాను ఒంటరిగా మాట్లాడాలని తెలిపారు. తనీఖీలో భాగంగా అనుకున్న ఆ సూపరింటెండెంట్‌ కూడా సరే అని రూం బయటే ఉండిపోయాడు.

బాలికల గదిలోకి వెళ్లగానే.. ఆ అధికారి ముందుగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం గురించి పలు ప్రశ్నలు అడిగారు. తర్వాత బాలికల మంచంపైన కూర్చొని వారిపై చేతులు వేయడం, కౌగిలించుకోవడం వంటి వెకిలి చేష్టలు చేయడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా బాలికలు ఇబ్బందిపడేలా వారి వ్యక్తిగత విషయాలను కూడా అడిగాడు.  11 నుంచి 13 ఏళ్ల వయసున్న విద్యార్థినులతో అతను దారుణంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినులు సూపరింటెండెంట్‌తో కలిసి సోమవారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు.

మరోవైపు, బాలికల ఫిర్యాదుని నమోదు చేసుకున్న  పోలీసులు ఆ అధికారిపై కేసు నమోదు చేశారు. అదే సమయంలో ఈ విషయం వెలుగులోకి రావడంతో,  జిల్లా కలెక్టర్‌ నివేదిక ఆధారంగా నిందితుడిని విధుల నుంచి కూడా సస్పెండ్‌ చేశారు. పోలీసులు సునీల్‌ యాదవ్‌ ఝాను పోక్సో కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరచి, జుడిషియల్‌ కస్టడీకి తరలించారు.

చదవండి: ‘ఏమండీ వంటగదిలో డబ్బులు పెట్టాను. తీసుకోండి.. మీరు, పిల్లలు జాగ్రత్త’.. అంటూ

మరిన్ని వార్తలు