అదే పనిగా ఫోన్‌లో మాట్లాడుతున్న కూతురు.. కొట్టి చంపిన తండ్రి..

19 Dec, 2022 08:36 IST|Sakshi

ముషీరాబాద్‌: వద్దని చెప్పినా ఫోన్‌ అదే పనిగా ఫోన్‌ మాట్లాడుతుందనే కోపంతో గొంతునులిమి చంపాడు ఆ కసాయి మారు తండ్రి. ఈ దారుణ ఘటన ముషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.  సీఐ జహంగీర్‌ యాదవ్‌ కథనం ప్రకారం....రహిమున్నీసా అలియాస్‌ సన్నూబేగం.. బెహ్రాన్‌ దేశంలో హౌస్‌కీపింగ్‌ పనిచేస్తోంది. బేగంపేటకు చెందిన అక్బర్‌తో మొదటి వివాహం జరగగా పదేళ్ల క్రితం రైలు ప్రమాదంలో అతను మరణించాడు.

అప్పటికే వారికి షేక్‌ ఆయాజ్, నౌసీన్‌ ఉన్నీసా, యాసీన్‌ ఉన్నీసా(17) అనే ముగ్గురు సంతానం కలిగారు. మొదటి భర్త అక్బర్‌ మృతి తర్వాత రహిమున్నీసా ముషీరాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ మహ్మద్‌ తౌఫిక్‌ను వివాహం చేసుకుంది. కాగా, ముగ్గురి పిల్లల్లో ఆయాజ్‌ షేక్‌ బేగంపేటలోని తన నాయన మ్మ దగ్గర నివసిస్తుండగా ఇద్దరు అమ్మాయిలు మారు తండ్రితోనే ఉంటున్నారు.

రెండవ కూమార్తె యాసీన్‌ ఉన్నీసా(17) నిత్యం ఫోన్‌లో మాట్లాడుతుండడంతో పలు మార్లు తౌఫిక్‌ అలా మాట్లాడొద్దని హెచ్చరించాడు. తాజాగా ఆదివారం తెల్లవారు జామున 3గంటల సమయంలోనూ యాసీన్‌ ఫోన్‌లో మాట్లాడుతూ ఉండడాన్ని గమనించిన తౌఫిక్‌ ఆవేశంతో ఫోన్‌ లాక్కున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావని, ఫోన్‌ పాస్‌వర్డ్‌ చెప్పాలని నిలదీశాడు. చెప్పకపోవడంతో చెంపలమీద రెండు దెబ్బలు వేశాడు.

దీంతో బెదిరిపోయిన యాసిన్‌ గట్టిగా ఏడుస్తుండడంతో చుట్టుపక్కల వాళ్లు వింటారు ఏడవొద్దంటూ గట్టిగా గొంతు నులమడంతో స్పృహతప్పి పడిపోయింది. వెంటనే తన సోదరి నౌసీన్‌ ఉన్నీసా హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లగా డాక్టర్లు పరీక్షించి అప్పటికే యాసీన్‌ మరణించినట్లు నిర్ధారించారు. దీంతో తౌఫిక్‌ ముషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.
చదవండి: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ రాసి..

మరిన్ని వార్తలు