పార్కింగ్ విషయంలో గొడవ.. 15 మంది గ్యాంగ్‌తో వెళ్లి తండ్రీకుమారులపై కాల్పులు

17 Feb, 2023 14:27 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని యమున విహార్‌లో గురువారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. కారు పార్కింగ్ విషయంలో గొడవ తలెత్తి తండ్రీకుమారులపై కాల్పులు జరిపాడు ఓ వ్యక్తి. 15 మంది గ్యాంగ్‌తో వెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. కాల్పుల్లో గాయపడిన ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

బాధితులిద్దరినీ వీరేంద్ర అగర్వాల్, శుభం అగర్వాల్‌గా గుర్తించారు. వీరిద్దరూ గురువారం రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు ఓ కారు రోడ్డు మధ్యలో పార్క్ చేసి ఉంది. దీంతో కారును అక్కడి నుంచి వేరే చోట పెట్టుకోవాలని, రోడ్డు బ్లాక్ అయిందని వీరేంద్ర సూచించాడు. ఈ విషయంలో కారు యజమానితో వాగ్వాదం జరిగింది. 

అయితే కాసేపయ్యాక కారు యజమాని 15 మందితో కలిసి వీరేంద్ర ఇంటికి వెళ్లాడు. ఈ గ్యాంగ్‌లోని ఓ వ్యక్తి వీరేంద్రతో పాటు అతని కుమారుడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరికి బుల్లెట్ గాయాలై తీవ్రంగా గాయపడ్డారు.

ఘటన అనంతరం 15 మంది అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఒక్కడిని మాత్రం స్థానికులు పట్టుకుని చితకబాదారు. దీంతో అతడు స్పృహ కోల్పోయాడు. కారు యజమానిని గుర్తించామని, అతనితో పాటు మిగతా అందరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
చదవండి: ప్రేమ నావలో ప్రయాణం.. సహజీవనం.. పెళ్లి ఊసెత్తితే చాలు!

మరిన్ని వార్తలు