తండ్రిని కొట్టి యువతిని కిడ్నాప్ చేసిన యువకులు.. ఎంగేజ్‌మెంట్ అయిన మరునాడే..

20 Dec, 2022 11:47 IST|Sakshi

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో  తండ్రి చంద్రయ్య తో కలిసి శాలిని(18) అనే యువతి హనుమాన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా నలుగురు యువకులు ఆమెను లాక్కెళ్లారు. గుడి ముందు  కాపుకాసి యువతి తండ్రిని కొట్టి ఆమెను ఎత్తుకెళ్లారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. శాలినికి సోమవారమే ఎంగేజ్‌మెంట్ అయినట్లు తెలుస్తోంది. మరునాడే ఆమెను యువకుడు కిడ్నాప్ చేయడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అయితే యువతి మైనర్గా ఉన్నప్పుడు గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధించాడు. దీంతో పోక్సో కేసులో అరెస్టయ్యి జైలుకు వెళ్లొచ్చాడు. అతడే తమ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంటాడని చంద్రయ్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు రెండు బృందాలుగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. కిడ్నాప్ చేసిన యువకుడ్ని జానేశ్వర్ అలియాస్ జానుగా గుర్తించారు.
చదవండి: వివాహేతర సంబంధాలకు కారణాలివే.. సర్వేలో షాకింగ్‌ విషయాలు

మరిన్ని వార్తలు