భార్యకు అబార్షన్‌... క్షుద్రపూజల కోసం బాలిక కళ్లు పీకి..

10 Aug, 2021 20:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పట్నా: సాంకేతికత ఎంత పెరుగుతున్నా తాంత్రిక, క్షుద్ర పూజల పేరిట జరిగే హత్యలు మాత్రం ఆగడం లేదు. తాజాగా బిహార్‌లో ఓ వ్యక్తి పదేళ్ల చిన్నారిని ​క్షుద్ర పూజాల కోసం దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంగేర్ జిల్లాలోని ఓ గ్రామంలో దిలీప్‌ కుమర్‌ చౌదరి తన భార్యకు తరచూ అబార్షన్‌ అవుతుండటంతో ఆ సమస్య నుంచి ఎలాగైనా బయటపడాలనుకున్నాడు. అబార్షన్‌ కాకుండా శాశ్వతంగా నివారించాలకున్నాడు.

దాని కోసం స్థానిక తాంత్రికుడు పర్వేజ్ ఆలమ్‌ను ఆశ్రయించాడు. అయితే పదేళ్ల ఓ బాలిక రక్తం, కళ్లతో క్షుద్రపూజ చేస్తే అబార్షన్‌ కాకుండా నివారించవచ్చని పర్వేజ్‌ చెప్పాడు. ఈ క్రమంలో ఆగస్టు 4న ఓ బాలిక తన తండ్రికి భోజనం ఇచ్చి తిరిగి వస్తుండగా.. దిలిప్‌ కుమార్‌ తన స్నేహితులతో కలిసి ఆమెపై దాడి చేసి కళ్లను పీకి, రక్తం సేకరించాడు. అయితే ఆ బాలిక తిరిగి ఇంటికి ఎంతకు రాకపోవటంతో అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు మరుసటి రోజు గ్రామంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేయడానికి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా పర్వేజ్ ఆలమ్‌, దిలీప్‌ కుమర్‌ చౌదరి, తన్వీర్ ఆలమ్‌, దశరథ్ కుమార్ అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. అయితే నరబలి కారణంగా తమ కుమర్తెను హత్య చేయలేదని, హత్యాచారం చేసి చంపారని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను శిక్షించి తమకు న్యాయం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు