బతకాలనిపించడం లేదు 

20 Nov, 2020 07:59 IST|Sakshi

సోదరితో చెప్పిన రెండ్రోజులకే బలవన్మరణం

భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య

పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

సాక్షి, రాంగోపాల్‌పేట్(సికింద్రాబాద్‌)‌: తనకు బతకాలనిపించడంలేదని సోదరితో చెప్పిన రెండ్రోజులకే ఆ యువతి తనువు చాలించింది. నగరంలోని టెక్‌ మహీంద్రా సంస్థలో పనిచేసే ఓ యువతి అదే కార్యాలయంలోని ఆరో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం  చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నామాలగుండ ఉప్పరబస్తీకి చెందిన వస్త్ర వ్యాపారి రంగన్‌ గోవిందరాజ్, శీల దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె గోవిందరాజు సుస్మిత (21) క్లాక్‌టవర్‌ ప్రాంతంలోని టెక్‌ మహీంద్రాలో ఈ ఏడాది అక్టోబర్‌ 30న శిక్షణ కోసం చేరింది. శిక్షణ పూర్తయిన అనంతరం ఈ నెల 13న ఇక్కడే అసోసియేట్‌ కస్టమర్‌ సపోర్ట్‌గా విధులు నిర్వహిస్తోంది. ప్రతి రోజు ఉదయం గోవిందరాజ్‌ కుమార్తెను తన ద్విచక్ర వాహనంపై తీసుకువచ్చి కార్యాలయం వద్ద వదలి వెళుతుంటారు.  చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం: మృతుల్లో ఆరుగురు చిన్నారులు

చైర్లు వేసుకుని.. 
ప్రతిరోజులాగే గురువారం ఉదయం 9.30 గంటలకు ఆయన సుస్మితను వదలివెళ్లారు. 10 గంటలకు ఆమె విధుల్లో చేరాల్సి ఉండగా 9.40 నిమిషాలకు ఆరో అంతస్తులోని క్యాంటిన్‌కు వెళ్లి అక్కడి నుంచి వాష్‌రూమ్‌కు వెళ్లింది. బాత్రూం పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి చైర్లు వేసుకుని పైకి ఎక్కి గ్రిల్స్‌ లేని కిటికి నుంచి కిందకు దూకింది. వెంటనే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది హుటాహుటిన అక్కడికి వెళ్లి పరిశీలించగా అప్పటికే చనిపోయింది. విషయం తెలుసుకున్న గోపాలపురం పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.  పెళ్లి కావట్లేదని యువతి ఆత్మహత్య

పోలీసుల విచారణ.. 
రెండు రోజుల క్రితం సోదరితో తనకు భూమి మీద జీవించాలని అనిపించడం లేదని అన్నట్లు తెలిసింది. ఆత్మహత్యకు ముందు కూడా తోటి ఉద్యోగినితో కూడా ఇలాగే మాట్లాడినట్లు తెలిసింది. అయితే ఆమెకు ఇంట్లో ఎక్కడ ఎలాంటి సమస్యలు లేవు. ఉద్యోగంలో చేరి కూడా 5 రోజులు మాత్రమే కావడంతో ఇక్కడ ఎలాంటి సమస్యలు లేవు. ఏదైనా ప్రేమ వ్యవహారం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె చనిపోయే ముందు చివరి కాల్‌ ఎవరికి చేసింది అనేది పోలీసులు పరిశీలిస్తున్నారు.  

తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు.. 
విషయం తెలుసుకున్న సుస్మిత తల్లిదండ్రులు హుటాహుటిన టెక్‌ మహీంద్రా కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే మృతదేహాన్ని తరలించారు. తమ కుమార్తె చనిపోయిందని తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.     

మరిన్ని వార్తలు