బైక్‌,సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య 

9 Jul, 2021 08:57 IST|Sakshi

గాండ్లపెంట(అనంతపురం): తండ్రి ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్‌ కొన్విలేదని ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థి కుటాగుళ్ల రెడ్డిబాషా (18) గురువారం విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. హెడ్‌కానిస్టేబుల్‌ రామయ్య తెలిపిన వివరాల మేరకు..  రెడ్డిబాషా స్వగ్రామం మలమీదపల్లి పంచాయతీ అరమడకవారిపల్లి. ఇదే మండలంలోని తూపల్లిలో నానమ్మ హసన్నమ్మ ఒంటరిగా ఉండడంతో ఆమె వద్ద ఉంటూ కదిరిలో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ చదువుకునేవాడు.

అయితే తనకు ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్‌ కావాలని రెడ్డిబాషా తన తండ్రి నబీని అడిగాడు. అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పడంతో మనస్థాపానికి గురైన రెడ్డిబాషా విషపు గుళికలు మింగాడు. తర్వాత తనే స్వయంగా 108 సిబ్బందికి ఫోన్‌ చేయగా వారు కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రెడ్డిబాషా మృతి చెందాడు. మృతుడి చిన్నాన్న హసన్‌వలీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

విడపనకల్లులో అర్చకుడు... 
విడపనకల్లు: మండల పరిధిలోని చీకలగురికి చెందిన ప్రకాష్‌ (28) అనే అర్చకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలమేరకు... చీకలగురికి ఉండబండ వీరభద్రస్వామి దేవాలయంలో ప్రకాష్‌ పూజారిగా పనిచేసేవాడు. అయితే  సంవత్సర కాలంగా భార్య కాపురానికి రాకపోవంతో మనస్తాపానికి గురై మూడు రోజుల కిందట చీకలగురికిలోని తన సొంత ఇంటిలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పక్కల నివాసం ఉన్న వారికి గురువారం దుర్వాస వస్తుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాల్తూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు