మరీ ఇంత దుర్మార్గమా: కన్నతల్లిని కడతేర్చి.. ఆపై

2 Feb, 2021 17:36 IST|Sakshi

రాంచి: తప్పతాగి ఇంటికి రావొద్దన్నందుకు కన్నతల్లినే కడతేర్చాడో దుర్మార్గుడు. ఇంటి ప్రాంగణంలోనే చితి పేర్చి నిప్పంటించాడు. అంతటితో ఆగక దానిపై చికెన్‌ కాల్చుకుని తింటూ సేదతీరాడు. మద్యం మత్తులో తూగుతూ మనిషనిననే విషయమే మర్చిపోయి రాక్షసంగా ప్రవర్తించాడు. వివరాలు.. జార్ఖండ్‌లోని వెస్ట్‌ సింగ్‌భూం జిల్లాకు చెందిన సుమీ సోయ్‌ కొడుకు ప్రధాన్‌ సోయ్‌తో కలిసి జీవిస్తోంది. తాగుడుకు బానిసైన ప్రధాన్‌, తల్లికి సాయం చేయకపోగా, ఆమె కష్టపడి సంపాదించిన డబ్బుతో జల్సాలు చేస్తూ కాలం గడిపేవాడు. పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకునేవాడు కాదు.ఈ క్రమంలో సోమవారం తల్లీకొడుకుల మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది.(చదవండి: 84 ఏళ్ల కోపిష్టి వృద్ధుడు.. భార్యను చంపి..)

దీంతో కర్రతో సుమీ తలపై బలంగా బాది ఆమెను హత్య చేశాడు. అనంతరం ఇంట్లో ఉన్న వస్తువులతో చితిలాగా పేర్చి శవాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించాడు. అలాగే నిద్రపోయాడు. తెల్లవారేసరికి సగం కాలిన మృతదేహాన్ని చూసి బెంబేలెత్తిపోయిన అతడు.. మిగతా భాగాన్ని స్టవ్‌పై కాల్చి ఆనవాలు లేకుండా చేయాలని చూశాడు. కానీ అంతలోనే సోదరి రావడంతో ప్రధాన్‌ నిర్వాకం బయట పడింది. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అప్రమత్తమైన ఇరుగుపొరుగు ఇంట్లోకి వచ్చారు. ప్రధాన్‌ను కట్టిపడేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం గురించి స్థానిక పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. తాగిన మైకంలోనే నిందితుడు నేరానికి పాల్పడ్డట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు