ప్రేమ పెళ్లి.. ఇంటికి వచ్చిన కోడలిని గుడికి తీసుకెళ్లి

11 Apr, 2023 16:25 IST|Sakshi

బీహార్‌ ఛప్రాలోని పానాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ధేనుకి చావర్ గ్రామ సమీపంలో 15 రోజుల క్రితం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతి చెందిన మహిళ గౌరా ఓపీ పరిధిలోని చందా గ్రామానికి చెందిన నితీష్ కుమార్ భార్య పూజా కుమారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరిపిన అనంతరం మహిళను ఆమె అత్త హత్య చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. దీంతో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే..  నాలుగేళ్ల క్రితం నితీష్, పూజని వివాహం చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి అతని కుటుంబసభ్యులకు ఇష్టం లేకుండా జరిగింది. పెళ్లయిన తర్వాత నితీష్ తన భార్యతో కలిసి వేరే చోట నివాసం ఉంటున్నాడు. కొన్నాళ్ల తర్వాత నితీష్‌ కుటుంబ సభ్యులు అతనితో పాటు పూజను ఇంటికి ఆహ్వానించారు. ఇంటికి వచ్చిన కొడుకు, కోడలితో నితీష్‌ తల్లి ఎంతో అప్యాయంగా మాట్లాడింది. కొడుకుకి అనుమానం రాకుండా నితీష్ తల్లి తన స్నేహితులతో కలిసి కోడలిని గుడికి తీసుకెళ్తున్నట్లు చెప్పింది. 

కోడలిపై కోపం పెంచుకున్న అత్త.. ధనుక గ్రామంలో పూజను హత్య చేసి మృతదేహాన్ని చన్వార్‌లోని కాలువలో పడేసింది.  భార్య అదృశ్యమైన తర్వాత నితీష్ ఆమె కోసం అన్ని చోట్ల వెతికాడు. కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. పది రోజుల తర్వాత, పూజ మృతదేహాన్ని పోలీసులు కాలువలో కనుగొన్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. పోలీసులకు అనుమానం వచ్చి లోతుగా విచారణ జరపగా పూజను ఆమె అత్త హత్య చేసినట్లు అసలు బండారం బయటపడింది. 

మరిన్ని వార్తలు