ఏం స్కెచ్‌ వేశాడు, ఫోన్‌ మాట్లాడుతా అని.. ఫోన్‌ పే చేశాడు

23 Feb, 2022 15:00 IST|Sakshi

ఇంటర్నెట్‌ నిర్వాహకుడికి రూ.40 వేలు టోకరా

తిప్పర్తిలో సంఘటన

సాక్షి,రామగిరి(నల్లగొండ): ఫోన్‌ మాట్లాడుతా అని ఇంటర్నెట్‌ సెంటర్‌ నిర్వాహకుడి ఫోన్‌ నుంచి గుర్తుతెలియని వ్యక్తి డబ్బులు పంపించుకున్న సంఘటన మంగళవారం తిప్పర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు.. తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన సోమగోని సైదులు తిప్పర్తి సెంటర్‌లో ఇంటర్‌నెట్‌ సెంటర్‌ నడుపుతున్నాడు. మంగళవారం ఉదయం 10.30గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి తెలిసిన వాళ్లకి డబ్బులు పంపించాలని సైదులును అడిగాడు.

పంపిస్తామని సైదులు చెప్పాడు. ముందుగా ఒక రూపాయి పంపమని అన్నాడు. సైదులు ఫోన్‌పే ద్వారా రూపాయి పంపిస్తున్న సమయంలో చాటుగా పాస్‌వర్డ్‌ను చూసిన సదరు వ్యక్తి డబ్బులు పడ్డాయా లేదా అని తెలుసుకుంటానని సైదులు ఫోన్‌ అడిగాడు. ఫోన్‌ చేస్తున్నట్లు నటిస్తూ రెండు సార్లు రూ.20 వేల చొప్పున మొత్తం రూ.40 వేలు తనకు పంపించుకున్నాడు. అనంతరం సైదులకు ఫోన్‌ ఇచ్చి వెంటనే వస్తానని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. సైదులు తేరుకొని చూసేసరికి ఫోన్‌ నుంచి డబ్బులు పంపించుకున్నట్లు గమనించి డబ్బులు పంపిన ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేయగా ఒకసారి ఎత్తి మాట్లాడాడు. మరల తిరిగి ప్రయత్నించగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో బాధితుడు తిప్పర్తి పోలీస్‌ స్టేషన్‌ను వెళ్లి, సైబర్‌ క్రైం టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేశాడు. 

మరిన్ని వార్తలు