దారుణం: కాళ్లు,చేతులు నరికిన భర్త

16 Sep, 2021 14:21 IST|Sakshi
గాయపడిన ఈశ్వరమ్మ 

చక్రాయపేట(వైఎస్సార్‌ జిల్లా): నిద్రపోతున్న భార్య కాళ్లు,చేతులను భర్త నరికిన సంఘటన చక్రాయపేట మండలంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు ఇస్లావత్‌ ఈశ్వరమ్మ (48), భర్త నాగానాయక్‌ (63)తో కలిసి కే. ఎర్రగుడి గ్రామం బీఎన్‌ తాండాలో నివసిస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు. వారికి వివాహాలయ్యాయి.అయితే  భార్యభర్తల మధ్య మూడేళ్లుగా గొడవలు జరుగుతుండేవి. దీంతో ఈశ్వరమ్మను కుమారులు వారి వద్దకు తీసుకెళ్లారు. (చదవండి: భార్యపై అనుమానం.. చివరికి ఏం చేశాడంటే..?)

గ్రామస్తులు ఆమెకు, కుమారులకు నచ్చచెప్పి మళ్లీ భర్త దగ్గర వదిలేసేవారు. వినాయక చవితి పండుగరోజు కూడా భార్యాభర్తలు గొడవపడినట్లు గ్రామస్తులు తెలిపారు. బుధవారం రాత్రి ఏమి జరిగిందో ఏమో కానీ  ఆమె నిద్రిస్తుండగా నాగానాయక్‌ కొడవలితో  కాళ్లు, చేతులు నరికేశాడు.ఈశ్వరమ్మ కేకలు విని ఇరురు పొరుగువారు రావడంతో నాగానాయక్‌ పారిపోయాడు.రక్తపు మడుగులో ఉన్న ఈశ్వరమ్మను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈశ్వరమ్మను చికిత్స నిమిత్తం కడపకు తరలించారు. పారిపోయిన నాగానాయక్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
చదవండి:
టికెట్‌ తీసి సాధారణ ప్రయాణికుడిలా..

మరిన్ని వార్తలు