Hyderabad: రూమ్‌ షేరింగ్‌ కోసం సాఫ్ట్‌వేర్‌ ఓఎల్‌ఎక్స్‌ ప్రకటన.. వేశ్య అని తెలియడంతో..

17 Nov, 2023 10:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు వైరల్‌ చేస్తానంటూ ఓ యువకుడిని ఒక యువతి వేధింపులకు గురి చేస్తున్న సంఘటన మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన కిరణ్‌కుమార్‌ కృష్ణానగర్‌లో ఉంటున్నాడు. ఏడాది క్రితం అతను రూం షేరింగ్‌ కోసం ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన ఇచ్చాడు.

ఓ యువతి స్పందించి తాను షేర్‌ చేసుకుంటానని చెబుతూ కూకట్‌పల్లిలో రూం తీసుకోవాలని కోరింది. దీంతో ఇద్దరూ కలిసి గదిలో ఉంటున్నారు. అయితే తాను వేశ్యనని ఆమె చెప్పడంతో, తన ప్రవర్తన నచ్చక  కిరణ్‌ ఆమెను బయటికి వెళ్లాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో పాటు తాము సన్నిహితంగా ఉన్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తానంటూ బెదిరించింది.

అంతేగాక తనపై లైంగిక దాడిచేశాడని సైబరాబాద్‌ షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. వారు ఇద్దరికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తర్వాత అతడి నుంచి ఆమెకు రూ.4.70 లక్షలు పరిహారంగా చెల్లించాడు. అనంతరం సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్‌ చేయడంతో కిరణ్‌కుమార్‌ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా వాటిని తొలగించారు. ఈ నెల 13న రాత్రి ఆమె కిరణ్‌ను సారథి స్టూడియో వద్దకు రప్పించి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అతడిపై దాడి చేసింది. గురువారం అతను మధురానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

 
 

మరిన్ని వార్తలు