Tamil Nadu: ప్రాణం తీసిన కోడి వివాదం

16 Aug, 2021 06:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు: పందెం కోళ్ల కోనుగోలుపై తలెత్తిన గొడవ ఒకరి ప్రాణం తీసింది. వివరాలు..కృష్ణగిరి జిల్లా తంజావూరుకు చెందిన అహ్మద్, అతని కుమారుడు ఇమ్రాన్‌ (22) కోడి పందెం ఆడుతుంటారు. కృష్ణగిరి నేతాజీ రోడ్డుకు చెందిన మార్గో (56) వద్ద కొనుగోలు చేసిన కోళ్లు పందెంలో సరిగ్గా ఆడలేదని గొడవపడ్డారు. ఈ క్రమంలో పాతపేట థియేటర్‌ వద్ద ఇమ్రాన్‌పై మార్గో, అతని కుమారుడు ఆరన్‌ కత్తితో హత్య చేశారు. అడ్డొచ్చిన ఇమ్రాన్‌ అన్న సలావుద్దీన్‌ (36)కు కత్తిపోట్లు పడ్డాయి. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

నీట మునిగి ఇద్దరు చిన్నారుల మృతి
తిరువొత్తియూరు: వేర్వేరు చోట్ల ఇద్దరు చిన్నారులు నీట మునిగి మృతి చెందారు. వివరాలు.. చెన్నై వ్యాసర్‌పాడి కన్నికాపురానికి చెందిన నవనీతన్‌ కుమార్తె విశాలి (12), కుమారుడు నితీష్‌ కుమార్‌ (07)తో కలిసి తిరుకులకుండ్రం కేలంబాక్కంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. శనివారం మధ్యాహ్నం విశాలి, నితీష్‌కుమార్‌ సరదాగా అక్కడున్న నీటి కాలువలో దిగారు. నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో నీటిలో మునిగిపోయారు. స్థానికులు ఇద్దరిని బయటకు తీసి చెంగల్‌పట్టు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళుతుండగా మార్గంమధ్యలో విశాలి మృతి చెందింది. నితీష్‌కుమార్‌ చికిత్స పొందుతున్నాడు.  

ప్రాణం తీసిన సెల్ఫీ  
చెన్నై చూలైమేడుకి చెందిన ఆర్ముగన్‌ కుమారుడు నితీష్‌ (17) ప్లస్‌–2 చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం సోదరుడు రాహుల్, స్నేహితులు సూర్య, ఎలిల్‌ అరసన్‌తో సహా ఏడుగురితో కలిసి సింగరాయపురంలోని రాళ్ల క్వారీ గుంతలో దిగారు. స్నానం చేస్తూ సెల్ఫీ తీసుకుంటున్నారు. అదే సమయంలో నితీష్‌ నీట మునిగిపోయాడు. ఇది చూసిన మిత్రులు అతన్ని కాపాడేందుకు యత్నించినా వీలు కాలేదు. మదురవాయల్‌ అగ్నిమాపక సిబ్బంది విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. మాంగాడు పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష కోసం కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.  

  

మరిన్ని వార్తలు