తనను కాదని.. మనువాడిందని కత్తితో దాడి

12 Jan, 2022 06:52 IST|Sakshi

అమీర్‌పేట: తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో మహిళపై కత్తితో దాడి చేశాడో వ్యక్తి. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎర్రగడ్డలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సైదులు చెప్పిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతి(35)కి ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో 2007లో వివాహమైంది. వీరు జీవనోపాధి కోసం నగరానికి వచ్చి ఎర్రగడ్డ బి.శంకర్‌లాల్‌నగర్‌లో ఉండేవారు.

తొలి కాన్పులో ఆమెకు కుమారుడు, రెండోసారి కూతురు జన్మించారు. కూతురు పుట్టిందనే నెపంతో 2009లో ఆమెను భర్త వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి శ్యామల కొడుకు, కూతురితో కలిసి నగరంలోనే ఉంటోంది. 2016లో సుల్తాన్‌నగర్‌లో ఉండే సైకిల్‌ మెకానిక్‌ సయ్యద్‌ ఖలీల్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం వీరు సహజీవనం చేశారు. ఈ నేపథ్యంలో 2017లో బి.శంకర్‌లాల్‌నగర్‌కు చెందిన చెఫ్‌ శ్రీశైల్‌ కోట్‌ను వివాహం చేసుకుంది.

వీరికి ఓ కుమారుడు జన్మించాడు. ఈ విషయం ఖలీల్‌కు తెలియడంతో ఆమెపై ఖలీల్‌ కక్ష పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా కడతేర్చాలనే నిర్ణయానికి వచ్చాడు. ఎర్రగడ్డ సంతలో మూడు కత్తులను కొనుగోలు చేసి గౌతంపురి కాలనీలో ఆమెపై  కత్తితో దాడి చేశాడు. క్షతగాత్రురాలిని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

మరిన్ని వార్తలు