Online Dating: మొదట డేటింగ్‌..ఆపై ఇంటికి రప్పించుకుని నీళ్లలో మత్తుమందు కలిపి..

27 Oct, 2021 12:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో డేటింగ్ పేరిట పురుషులను ట్రాప్‌ చేసి, ఆపై వారిని బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న కిలాడీలను కటకటాల వెనక్కి నెట్టారు ఢిల్లీ పోలీసులు. ఈ డేటింగ్‌ బాగోతం దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో చోటుచేసుకుంది. తాజాగా ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో ఇందులో ప్రధాన పాత్ర పోషించిన మహిళను ఆమెకు సహకరించిన మరో నలుగురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. నిందితులు మొదట ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ ద్వారా బాధితులతో స్నేహం చేసి, తర్వాత వారిని తమ ఇంటికి రప్పించుకుంటారు. అలా వచ్చని వారికి మత్తుమందు కలిపిన నీరు లేదా కూల్‌డ్రింక్స్‌ ఇస్తారు. అది తాగి స్పృహ కోల్పోయిన తరువాత వారిని మహిళతో చనువుగా ఉన్నట్లు ఫోటోలు తీయడంతో పాటు ​అభ్యంతకరమైన ఫోటోలు తీసి బెదిరింపుల పర్వాన్ని మొదలుపెడతారు. ఈ తరహాలోనే ఇటీవల ఓ వ్యాపారికి ప్లై బోర్డు కావాలని ఓ మహిళ నుంచి కాల్ వచ్చింది. దీంతో అతను అక్టోబర్ 21న జనక్‌పురి ప్రాంతంలోని నిందితురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె తాగడానికి ఒక గ్లాసు మంచినీరు ఇవ్వగా దాన్ని తాగిన వెంటనే అతను స్పృహతప్పి పడిపోయాడు. వ్యాపారి స్పృహలోకి వచ్చినప్పుడు నగ్నంగా మంచం మీద ఉన్నాడు. 

కళ్లు తెరచి చూడగా చూట్టూ ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులు అతనిపై దాడి చేసి, తన వద్ద ఉన్న సుమారు 16 వేల రూపాయల నగదు, చేతి గడియారం, బంగారు ఉంగరం లాక్కున్నారు. అంతే కాకుండా మరో రూ.7 లక్షలు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వ్యక్తుల నుంచి తాము కొన్ని ఫైళ్లు, డబ్బు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. గత రెండేళ్లలో ఈ ముఠా దాదాపు 40 మంది పురుషుల నుంచి విలువైన వస్తువులను తీసుకున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు.

చదవండి: భర్తకు అన్నం వడ్డించి.. అంగడికి వెళ్లొస్తానని చెప్పి నవవధువు అదృశ్యం

మరిన్ని వార్తలు