టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో మరో కొత్త కోణం..

28 May, 2023 15:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది.  వరంగల్‌ జిల్లాకు చెందిన విద్యుత్‌ శాఖ డీఈ పేరు కొత్తగా వెలుగులోకి వచ్చింది. విద్యుత్‌ శాఖ డీఈ కనుసన్నల్లో ఏఈ పేపర్‌ చేతులు మారినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో విద్యుత్‌ శాఖ జూనియర్‌ అసిస్టెంట్‌ రవికిషోర్‌ను సిట్‌ అరెస్ట్‌ చేసింది. ఆయన 20 మందికి పశ్నాపత్రాలు విక్రయించినట్లు సిట్‌ బృందం గుర్తించింది. డీఈ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఓ కోచింగ్ సెంటర్‌లో శిక్షకుడిగా పనిచేస్తున్నాడని, అభ్యర్థులతో పరిచయం పెంచుకుని ఈ దందాకు తెరలేపినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. టాప్‌ మార్కులు వచ్చిన వారి వివరాలను సిట్‌ బృందం సేకరిస్తోంది. 

కాగా, ప్రశ్నపత్రాల లీకేజి కేసులో సిట్‌ అధికారులు గురువారం మరో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేయగా, దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 43కి, అరెస్ట్‌ అయిన వారి సంఖ్య 42కు చేరింది. ఈ వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్న కమిషన్‌ మాజీ ఉద్యోగులు పులిదిండి ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి ద్వారా అనేక ప్రశ్నపత్రాలు ఒకప్పుడు కమిషన్‌లో పని చేసిన వీరి స్నేహితుడు సురేశ్‌కు చేరాయి.
చదవండి: రవికిశోర్‌ ద్వారా మరో ముగ్గురికి.. 

ఇతడు వీటిలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ), డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏఓ) పేపర్లను తన అపార్ట్‌మెంట్‌లో నివసించే వారికి మధ్యవర్తి ద్వారా విక్రయించాడు. ఈ వ్యవహారంలో నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పూల రవికిశోర్‌ మధ్యవర్తిగా వ్యవహరించాడు. సురేశ్‌ గతంలోనే అరెస్టు కాగా.. రవికిశోర్‌తోపాటు ఏఈ, డీఏఓ పేపర్లు ఖరీదు చేసిన అన్నాచెల్లెళ్లు రాయపురం విక్రమ్, దివ్యలను బుధవా­రం అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు