స్పా ముసుగులో వ్యభిచారం

16 Oct, 2022 04:02 IST|Sakshi

విజయవాడలో 19 స్పా, మసాజ్‌ సెంటర్ల సీజ్‌ 

18మంది యువతులు, ఏడుగురు విటులు, ఆరుగురు నిర్వాహకులపై కేసు

డీసీపీ విశాల్‌ గున్ని వెల్లడి 

విజయవాడ స్పోర్ట్స్‌: నగరంలోని కొన్ని స్పా, మసాజ్‌ సెంటర్లలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఏకకాలంలో పలు స్పా, మసాజ్‌ సెంటర్లలో తనిఖీలు నిర్వహించి 19 కేంద్రాలను సీజ్‌ చేశారు. ఈ వివరాలను ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ డీసీపీ విశాల్‌ గున్ని శనివారం వెల్లడించారు. విజయవాడలో 200కు పైగా స్పా, మసాజ్‌ సెంటర్లు ఉన్నాయని డీసీపీ తెలిపారు.

కొన్ని స్పా, మసాజ్, ఫిట్‌నెస్, వెల్‌నెస్, స్లిమ్మింగ్, హెల్త్‌ సెంటర్లలో హైటెక్‌ వ్యభిచారం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. ఆయా సెంటర్లపై వారం రోజులుగా నిఘా పెట్టామన్నారు. ఈ సెంటర్లలో 20 ప్రత్యేక పోలీసు బృందాలతో శుక్రవారం రాత్రి ఏకకాలంలో తనిఖీలు నిర్వహించగా, 19 కేంద్రాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు.

దివ్య యూనిసెక్స్‌ యూటీ సెలూన్, గోల్డెన్‌ కోక్స్, నోవా వెల్‌నెస్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌లలో వ్యభిచారానికి సంబంధించిన కొన్ని వస్తువులు లభించినట్లు డీసీపీ తెలిపారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత 19 కేంద్రాలను సీజ్‌ చేశామని, అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్న 18 మంది ఇతర రాష్ట్రాలు, దేశాల యువతులను, ఏడుగురు విటులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు.

వారితోపాటు ఆరు కేంద్రాల నిర్వాహకులపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, అందరినీ కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ కె.శ్రీనివాసరావు, ఏసీపీ ఖాదర్‌బాషా పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు